మాదన్నపేటలో టెన్షన్, హైదరాబాదులో 2 చోట్ల కర్ఫ్యూ

ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. రాత్రి నుండి అల్లర్లు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ఇరవై బస్సులు, 10 దుకాణాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో సాధారణ పరిస్థితి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. భారీగా పోలీసులను మోహరించారు.
ఘటనా స్థలి వద్దకు చేరుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఓ సమయంలో లాఠీఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. మాదన్నపేట, చంపాపేట, సంతోష్ నగర్, సైదాబాద్ ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. నగర పోలీసు కమిషనర్ ఎకే ఖాన్, అదనపు కమిషనర్ అమిత్ గార్గ్ పరిస్థితిని స్వయంగా సమీక్షించారు.
మాదన్నపేట సంఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిజిపిని ముఖ్యమంత్రి ఆదేశించారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా ఈ ఘటనపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైతే మరిన్ని బలగాలు తరలించాలని ఆదేశించారు. రాష్ట్రమంతా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
కర్ఫ్యూ విధించిన ప్రాంతాలలో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని ఎకె ఖాన్ ప్రజలకు సూచించారు. అవసరమైతే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని చెప్పారు. ఆ ప్రాంతంలో పలువురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications