జగన్ కేసులో మలుపు, వివిద దేశాలకు సిబిఐ లేఖలు
హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతకాలతో కూడిన ఈ లేఖలను బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, లంగ్జెంబర్గ్, సింగపూర్, హాంకాంగ్, బ్రిటన్లకు పంపినట్లుగా సమాచారం. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటికే ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఆయా దేశాలకు పంపిన లేఖలో సిబిఐ పలు వివరాలు కోరినట్లుగా తెలుస్తోంది.
దేశంలో నమోదయిన ఓ సంస్థ యజమానులు, అధీకృత సంతకాలు చేసిన వారి పేరు, బ్యాంక్ అకౌంట్ వివరాలు తదితరాలు నిర్ధారించి తెలియజేయాలని బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కు పంపిన లేఖలో రాసినట్లుగా తెలుస్తోంది. అలాగే మారిషస్ కేంద్రంగా ఉన్న కంపెనీల ద్వారా నిధులు భారత్కు మళ్లాయా అనే విషయం పైనా అడిగినట్లుగా తెలుస్తోంది.
బ్రిటిష్ వర్జీన్ ఐలాండ్స్లోని సంస్థ వాటాదారుల వాస్తవికతపై ప్రశ్నించింది. వారికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపిందట.
మారిషస్కు పంపిన లేఖలో రెండు కంపెనీల వివరాల్ని సిబిఐ కోరినట్లుగా తెలుస్తోంది. జగన్కు చెందిన సండూర్ పవర్ కంపెనీలోకి నిధులు బదలీ అయ్యాయా లేదా స్వీకరించారా అనేది తెలుసుకునేందుకు వాస్తవిక లేదా సర్టిఫైడ్ కాపీలు, మూడు అంతర్జాతీయ బ్యాంకర్ల బ్యాంకు అకౌంట్ల వివరాలను సమకూర్చాలని కూడా మారిషస్ను సిబిఐ అభ్యర్థించింది.