వైయస్ జగన్పై ఎన్ని కేసులు?: సిబిఐకి కోర్టు ప్రశ్న
వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిని ఇంకెన్నాళ్లు జైలులో పెడతారని ఆయన తరఫు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారని కోర్టు తెలిపింది. ప్రతి భూకేటాయింపునకు జీవో ఉందని గుర్తు చేసింది. భూకేటాయింపులకు సంబంధించి జీవోలున్నాయి, కొనుగోలుదార్లు ఉన్నారని చెప్పింది. విజయసాయి రెడ్డి బెయిల్ పిటిషన్పై సోమవారం నాలుగు గంటల పాటు వాదనలు జరిగాయి.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో తాము మరో 13 చార్జిషీట్లు దాఖలు చేస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది. ప్రతి చార్జిషీటులో జగన్ను తొలి నిందితుడిగా, విజయసాయి రెడ్డిని రెండో నిందితుడిగా చేరుస్తామని చెప్పింది. ఈ కేసులో విజయసాయి రెడ్డి కీలకమని, విచారణ ఇంకా జరగాల్సి ఉందని, ఈ పరిస్థితిలో విజయసాయి రెడ్డికి బెయిల్ ఇస్తే విచారణ దెబ్బ తినే అవకాశం ఉందని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని, అందువల్ల విజయసాయి రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దని సిబిఐ వాదించింది.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్లో పెట్టుబడుల పెట్టిన కంపెనీల జాబితా చార్టును సిబిఐ కోర్టుకు అందజేసింది. మరిన్ని కంపెనీల పేర్లను నిందితులుగా చేరుస్తామని చెప్పింది. డెలాయిట్ కంపెనీ ద్వారా అధిక ప్రీమియం చేయించింది విజయసాయి రెడ్డేనని సిబిఐ చెప్పింది. లెటర్స్ ఆఫ్ రెగోటరీ పంపించామని, వాటికి సమాధానాలు రావాల్సి ఉందని సిబిఐ చెప్పింది. సిబిఐ వాదనకు విజయసాయి రెడ్డి తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ అడుగడుగునా అడ్డు పడడానికి ప్రయత్నించారు.
విజయసాయి రెడ్డిని అరెస్టు చేసిన తర్వాతనే జగన్ ఆస్తుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని సిబిఐ చెప్పింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మేళ్లు పొందినవారే జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సిబిఐ వాదించింది. విజయ సాయి రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు సోమవారం ముగిశాయి. తన నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.
తాము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, త్వరలో వైయస్ జగన్ ఆస్తుల కేసులో చార్జిషీట్లు దాఖలు చేస్తామని సిబిఐ కోర్టుకు చెప్పింది. దర్యాప్తు చేయాల్సిన బాధ్యత, విధి సిబిఐ అధికారులకు ఉందని, చేయలేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని కోర్టు వ్యాఖ్యానిచింది.