చిరంజీవిని కాంగ్రెసు నాయకత్వం విస్మరిస్తోందా?
ప్రజారాజ్యం శాసనసభా పక్షాన్ని కాంగ్రెసు శానససభా పక్షంలో విలీనం చేయడానికి ముందు పార్టీ సమావేశాలకు విధిగా చిరంజీవిని ఆహ్వానిస్తూ వచ్చారు. అవసరమైతే ఆయన నివాసానికి వెళ్లి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వంటివారు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత ఆయనను పట్టించుకోవడం లేదని, చిరంజీవి లేకుండానే పార్టీ సమావేశాలు జరుగుతున్నాయని అంటున్నారు.
మొన్నటి దాకా తిరుపతి శాసనభా స్థానానికి చిరంజీవి ప్రాతినిధ్యం వహించారు. ఆ స్థానం ఉప ఎన్నిక కోసం వేసిన సమన్వయ కమిటీపై చిరంజీవిని సంప్రదించలేదని అంటున్నారు. రాజ్యసభ సీటుకు నామినేషన్ వేసే సమయంలో కూడా చిరంజీవి పట్ల కాంగ్రెసు నాయకులు గౌరవప్రదంగా వ్యవహరించలేదని వార్తాకథనాలు వస్తున్నాయి. సోనియా గాందీ ముందుగానే ఖరారు చేసిన తర్వాత కూడా రాష్ట్ర నాయకులు రాజ్యసభకు నామినేషన్ వేయించడంలో చిరంజీవికి చివరి ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నాైరు. మజ్లీస్ శాసనసభ్యులు సంతకాలు చేయలేదని చెప్పి దాదాపు గంటన్నర సేపు చిరంజీవి ఆపారని సమాచారం.
కాగా, ఢిల్లీలో కూడా ఆయనకు తగిన గౌరవం దక్కడం లేదని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై, ఉప ఎన్నికల వ్యూహరచనపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ తన భేటీలకు చిరంజీవిని ఆహ్వానించలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలతో నిర్వహించిన సమావేశాలకు ఆయనను పిలువలేదని అంటున్నారు.
పైగా, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్తో ఆజాద్ విడిగా మంతనాలు జరిపారు. రానున్న 18 శానససభా స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో చిరంజీవికి ప్రాధాన్యం ఉంటుందా, లేదా అనేది కూడా అనుమానంగా మారింది. ఎన్నికల్లో కాంగ్రెసు ప్రధాన ప్రచార రథసారథి చిరంజీవే అవుతారని అంటూ వచ్చినవారు ఇప్పుడు ఆయనను పట్టించుకోవడం లేదని అంటున్నారు. చిరంజీవి భవిష్యత్తు రాజ్యసభకు, కేంద్ర మంత్రి పదవికి మాత్రమే పరిమితమవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.