అలీఖాన్ను నిందితుడిగా ఎందుకు చేర్చారు?: కోర్టు
ఒఎంసి కేసులో అలీఖాన్ను నిందితుడిగా చేర్చడంపై ఆయన తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ నిబంధన కింద అలీఖాన్ను నిందితుడిగా చేర్చారో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. ఏ ఆధారాలు, చట్టంలోని ఏ వెసులుబాటు ప్రకారం నిందితుడిగా చేర్చామో రేపు చెబుతామని సిబిఐ తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.
సిబిఐ స్వాధీనం చేసుకున్న వాహనాలను తమకు తిరిగి అప్పగించాలని గాలి జనార్దన్ రెడ్డి, ఒఎంసి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సిబిఐ కోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. సోదాల సమయంలో సిబిఐ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన హెలికాప్టర్ను, అధునాతమైన కార్లను స్వాధీనం చేసుకుంది. వాడకుండా వదిలేస్తే అవి పాడుతాయని, వాటిని తిరిగి తమకు అప్పగించాలని, అవసరమైనప్పుడు వాటిని ప్రవేశపెడతామని గాలి జనార్దన్ రెడ్డి చెబుతూ పిటిషన్ దాఖలు చేశారు.
గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని ఒఎంసి కేసులో హైదరాబాద్ సిబిఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డిని ఎఎంసి కేసులో బెంగళూర్ తరలించారు. ఆయనను బెంగళూర్ కోర్టులో ప్రవేశపెట్టిన రోజే అనూహ్యంగా గాలి జనార్దన్ రెడ్డి పిఎ అలీఖాన్ కోర్టులో లొంగిపోయాడు. అప్పటి వరకు సిబిఐ అధికారులు అలీఖాన్ కోసం గాలిస్తూనే ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన పలు విషయాలు అలీఖాన్ వద్ద ఉందని సిబిఐ అధికారులు అనుమానిస్తూ వచ్చారు.