వైయస్ దళిత వ్యతిరేకే, నిరూపిస్తా: హర్షకుమార్ సవాల్
వైయస్ దళితులకు అన్యాయం చేశారని రుజువు చేసేందుకు అవసరమైన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయన్నారు. బహిరంగ చర్చకు ఎవరూ వచ్చినా నిరూపించేందుకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంటుల్లో ఎస్సీలకు వైయస్ అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. ఎస్సీలకు కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్ఎస్ఎఫ్డీసీ పథకాన్ని వైయస్సే రద్దు చేయించారన్నారు. దీంతో ఎస్సీలకు కేంద్రం నుంచి వచ్చే సుమారు వెయ్యి కోట్ల నిధులు నిలిచిపోయాయని చెప్పారు.
ఎస్సీ కాంపోనెంట్ నిధులను జలయజ్ఞానికి మళ్లించిన వైఎస్ ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు పెంచలేదని విమర్శించారు. రాష్ట్రంలో సెజ్లకు, పారిశ్రామికవేత్తలకు 88 వేల ఎకరాలు కేటాయించిన వైయస్ చాలా ప్రాంతాల్లో ఎస్సీల ఎసైన్డ్ భూములను బలవంతంగా సేకరించారన్నారు. తాను 2002లో రాజమండ్రి మేయర్గా పోటీ చేసినప్పుడు తనపై వైయస్ అనుచరులు అంబటి రాంబాబు, కెవిపి రామచంద్ర రావు ఢిల్లీకి తప్పుడు నివేదికలు పంపారని చెప్పారు.
ఇక జగన్ చాలా దుర్మార్గుడని, అవినీతి, అక్రమాలు, లంచగొండితనం ఆయన లక్షణాలని విమర్శించారు. వైయస్ దళితులకు న్యాయం చేశారంటూ కొంతమంది పాస్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఆర్థిక సాయం చేస్తూ చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారన్నారు. దీన్ని అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైయస్ హయాంలో దళితులకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేలా ప్రచారం చేస్తామన్నారు.
ఎస్సీల వర్గీకరణ సాధ్యం కాదని సుప్రీం కోర్టు ప్రకటించినా మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టించి ఎస్సీల వర్గీకరణ అంశాన్ని వైయస్ తెరమీదకి తెచ్చారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వైయస్సార్ కాంగ్రెస్కు పెయిడ్ వర్కర్గా పనిచేస్తున్నారని, మాలమహానాడు నాయకుని కేటగిరీలో పొందిన ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
ఎన్నో సమస్యలతో రాష్ట్రం సతమతమవుతున్న తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, అయితే పాలనలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు స్వేచ్ఛ ఇవ్వటం లేదని వ్యాఖ్యానించారు. ఎస్సీ కాంపొనెంట్ నిధులు రూ. 16 వేల కోట్లు ఎస్సీలకు కేటాయించేందుకు చట్టబద్ధత తీసుకొస్తానని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించటం హర్షణీయమన్నారు.