తెలంగాణలో వలసలు!: జగన్ పార్టీలోకి ఇంద్రకరణ్ రెడ్డి?

ప్రధానంగా తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో ఇంద్రకరణ్ రెడ్డి పూర్తి అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగా ఆయన గురువారం నిర్మల్లో తన వర్గం నేతలు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీలో ఉండాలా ఉండకూడదా, పార్టీ వీడితే ఏ పార్టీలో చేరితే కలిసి వస్తుందనే అంశంపై ఇంద్రకరణ్ రెడ్డి వారిని అడిగారని సమాచారం.
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం నాన్చుడు ధోరణి ఇబ్బందికరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఏమీ తేల్చక పోవడం వల్లనే ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని ఆయన కలత చెందుతున్నారని అంటున్నారు. ఏ పార్టీలో చేరాలో వచ్చే నెల రెండవ తేదీన తన నిర్ణయం ప్రకటిస్తానని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.
కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు తెలంగాణపై ఓ స్పష్టమైన నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోక పోవడంతో తెలంగాణ ప్రాంతం నుండి ఇప్పటి వరకు ఆయన పార్టీలో ఎవరూ చేరలేదు. కొండా సురేఖ, గోనె ప్రకాశ్ రావు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తదితర నేతలు మాత్రమే ఉన్నారు. వారు మొదటి నుండి జగన్తోనే ఉన్నారు. కానీ పార్టీ పెట్టాక పెద్ద స్థాయిలో చేర్పులు జరగలేదు. ఒకవేళ ఇంద్రకరణ్ రెడ్డి చేరితే అది తెలంగాణలో మరిన్నిచేరికలకు దారి తీస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications