సిఎం ఐతే నా ఫోటో కూడా పెట్టుకునేలా పాలిస్తా: జగన్

తన తండ్రి వైయస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అనేక మంది పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. తాను కూడా అదే విధంగా పాలిస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఫొటోతో పాటు నా ఫొటో కూడా పెట్టుకునేలా ప్రజల కోసం పాటుపడతానని అన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు తరుచూ ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవడంలో గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
వైయస్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్సుమెంట్స్, 108 పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక పాలనకు ఉప ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు. తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలను తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
మత్స్యకారుల పిల్లల విద్యా పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తీరంలో మత్స్యకారుల పిల్లలను ఉన్నత స్థితికి చేర్చేందుకు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. తీరంలో మత్స్యకారుల జీవనంపై ఎటువంటి కాలుష్య ప్రభావం చూపని పరిశ్రమలనే అనుమతిస్తామన్నారు.
ఈ పరిశ్రమల్లో ఎనభై శాతం ఉపాధి అవకాశాలు స్థానిక మత్స్యకారులకే కల్పిస్తామని చెప్పారు. అపష్కృతంగా ఉన్న సమస్యలను తీర్చుతామని చెప్పారు. అంతకుముందు ఆయన నరసాపురం పట్టణంలోని స్టేషన్ పేట నుంచి బుధవారం ఆయన రోడ్ షో ప్రారంభించారు. మొదట చర్చిలో ప్రార్థనలు చేసి ఆ తర్వాత పాతబజార్లోని మసీదులో నమాజు చేసి, అనంతరం పీచుపాలెంలోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications