జగన్, బ్రదర్ అనిల్ కుమార్ చిట్టా విప్పుతా: కెఏ పాల్

జగన్, అనిల్ కుమార్లు తనను ఎలా ఇబ్బంది పెట్టారో, ఎంతలా ఇబ్బందులకు గురి చేశారో త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. తనకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని వారు కలిగించారని ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అవినీతిదారుణమైనదిగా అభివర్ణించారు. ఆయన హయాంలో తనకు జరిగిన అన్యాయం ఆషామాషీ కాదన్నారు.
2007లో వైయస్కు లంచం ఇవ్వకపోవడం వల్లనే తనపై కక్ష పెంచుకొని ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ అయిదు స్థానాల నుంచి పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. నరసాపురం, రామచంద్రాపురం, పాయకరావుపేట, ప్రత్తిపాడు, ఒంగోలు స్థానాల నుండి అభ్యర్థులను బరిలోకి దింపుతామని చెప్పారు.
కాగా ఒంగోలులో సమావేశం పెట్టవద్దని జగన్ పార్టీ నేత నుండి బెదిరింపులు వస్తున్నాయని ఆయన గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. తాము ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు. ఒంగోలు సభను అడ్డుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల నుండి బెదిరింపులు వస్తున్నాయని, ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదని చెప్పారు. మీటింగ్ అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు.
అవినీతికి పాల్పడిన వారు జైలు పాలవడం ఖాయమని కెఏ పాల్ అంతకుముందు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు అవినీతిలో కూరుకు పోయినట్లుగా కనిపిస్తోందన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో తమ ప్రజాశాంతి పార్టీ తరఫున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తామని ఆయన చెప్పారు.
త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలోనూ అభ్యర్థులను నిలబెట్టే విషయంపై పార్టీలో చర్చిస్తున్నామని అప్పుడు చెప్పారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాలలో కొన్నిచోట్ల ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications