బాబు కలవలేదని రేవంత్ రెడ్డి, దోషేనని కోదండరామ్
రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటును వేదికగా ఉపయోగించుకోవద్దని సూచించారు. తాను చేస్తున్న ప్రకటనలపై దృష్టి మరల్చేందుకే చిదంబరం అలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. బాబును కలిశానని తప్పుడు సమాచారమిచ్చిన చిదంబరంపై కేసు వెంటనే పెట్టాలన్నారు. ఆయన ఏనాటికైనా జైలుకు వెళ్లక తప్పదన్నారు. పోలవరం టెండర్లు మళ్లీ స్యూ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
తప్పుడు పత్రాలు సమర్పించిన ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి, జెఏసి ఈ విషయంపై ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. పోలవరం టెండర్ల ఇష్యూపై తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాస్తున్నామని చెప్పారు. స్యూ కంపెనీపై చర్యలు తీసుకోవాలని సూచిస్తామన్నారు. ప్రైజ్ వాటర్ కూపర్ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లు పిలవడం దారుణమన్నారు.
కాగా చిదంబరం మాటలతో చంద్రబాబు అసలు దోషి అని తేలిందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ నిజామాబాద్ జిల్లాలో అన్నారు. చిదంబరం, బాబు తోడుదొంగల మాదిరిగా తెలంగాణను అడ్డుకుంటున్నారన్నారు. తెలంగాణపై కాంగ్రెసు తన వైఖరిని ఎంతకాలంలో స్పష్టం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు, టిడిపిలో తెలంగాణను అడ్డుకున్నాయన్నారు.
తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోదండరామ్ సూచించారు. ఆత్మహత్యలతో తెలంగాణ రాదన్నారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే పోరాట యోధుడు ఒకరు చనిపోయారని సీమాంధ్ర నేతలు సంతోషిస్తారన్నారు. కాబట్టి బతికి తెలంగాణ సాధించుకుందామని చెప్పారు. టిఆర్ఎస్తో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పరకాలలో ఎవరికి మద్దతివ్వాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
చిదంబరం వ్యాఖ్యలతో తెలంగాణలో టిడిపి జెండా పీకేయాల్సిన సమయం వచ్చిందని సిద్దిపేట తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణ అడ్డుకున్నది చంద్రబాబే అన్నారు. చిదంబరం, బాబులకు నార్కోఅనలిస్ట్ పరీక్షలు జరిపితే నిజాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు.