చంద్రబాబుకు వైయస్ జగన్ పోటు, తిరుపతిలో రెబెల్స్
శంకర్ రెడ్డి, ఓవి రమణ వంటి నాయకులు చదలవాడ కృష్ణమూర్తి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాము నామినేషన్లు వేస్తామని వారు అటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో తిరుపతి శాసనసభా నియోజకవర్గంలో పోటీ తెలుగుదేశం పార్టీకి కత్తి మీద సాములా మారింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం చేకూర్చేందుకే వారు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెసు నుంచి వెంకటరమణ బరిలోకి దిగుతున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇద్దరు కూడా బలిజ వర్గానికి చెందినవారే. ఇరు పార్టీల మధ్య ఆ సామాజిక వర్గం ఓట్లు చీలిపోతాయని భావిస్తున్నారు. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి గట్టెక్కడం సులభమవుతుందని భావిస్తున్నారు.
అసమ్మతివాదులను బుజ్జగించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలోని 18 స్థానాలకు, ఒక లోకసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.