శింగనమల, కళ్యాణ్లతో జగన్కు సంబంధమేంటి?: వర్ల
రాష్ట్రంలో జరుగుతున్నది ఏమిటో ఆఖరుకు ఒక క్రిమినల్ చెప్తే నమ్మని పరిస్థితి ఏర్పడిందన్నారు. సినీ పరిశ్రమ సెటిల్మెంట్లలోనూ భాను కిరణ్, మంగలి కృష్ణలను నడిపించే జగన్కు సంబంధాలున్నాయని ఆరోపించారు. కృష్ణ, భానుతో సంబంధాలు లేవని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ విస్తరించని రంగం ఏదన్నారు. పరిటాల రవి హత్య వెనుక రచన - దర్శకత్వం ఎవరితో తేల్చాలన్నారు. ఈ దిశగా సిఐడి విచారించాలని డిమాండ్ చేశారు.
జలయజ్ఞం ప్రాజెక్టుల్లో వసూళ్లు చేశామని భాను చెప్పిన నేపథ్యంలో అప్పటి సాగునీటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఏం సమాధానం చెబుతారన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి భాను వ్యవహారాలు చేశారని ఆరోపణలు వస్తున్నందున, సబిత హోంమంత్రిగా కొనసాగడం దారుణమన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతుల పొట్టగొట్టి బడాబాబులకు అడ్డగోలుగా చేసిన భూ కేటాయింపులు రద్దు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాయగలవా? అని జగన్కు మరో నేత పయ్యావుల కేశవ్ సవాలు విసిరారు. రైతులకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కారిస్తే సరిపోదని, తన తండ్రి హయాంలో వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరే సాహసం కూడా చేయాలని సూచించారు.
పరిశ్రమలు, పెట్టుబడుల సాకుతో వేల ఎకరాలను అప్పగిస్తే భూములు పొందినవారు వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.వందల కోట్లు రుణాలు తీసుకున్నారని పేర్కొన్నారు. అందులో కొంత జగన్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారని చెప్పారు. ఒప్పంద కాలపరిమితి పూర్తయినందున ఆ భూములను వెనక్కి తీసుకొని రైతులకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. జగన్తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారని, అందుకే అక్రమాలు రుజువైనా మౌనవ్రతం పాటిస్తున్నారని కేశవ్ ఆరోపించారు.