పరకాల అభ్యర్థిపై బిజెపి తర్జనభర్జన: ఐదు సీట్లకు ఓకె
అయితే, ఐదు స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఖరారు చేసింది. ఒంగోలు నుంచి స్థానంలో యోగయ్యను, నర్సాపురంలో వంశీ రాజును, ఎమ్మిగనూరులో ఎన్ శ్రీనివాస్ను, నర్సన్నపేటలో తేజేశ్వర రావును పోటీకి దించాలని బిజెపి నిర్ణయించింది. రామచంద్రాపురంలో స్వతంత్ర అభ్యర్థి గుత్తుల సూర్యనారాయణ బాబుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
పరకాల నుంచి ప్రేమేందర్ రెడ్డిని నిలబెట్టాలని బిజెపి తొలుత భావించింది. అయితే, దానికి జంగా రెడ్డి కూడా పోటీకి వచ్చారు. వీరిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మరొకరు సహకరించే అవకాశం లేదు. పైగా, బిజెపి రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుందనే భావన ప్రజల్లో నాటుకునే ప్రమాదం ఉంది. మహబూబ్నగర్ నుంచి యెన్నం శ్రీనివాస రెడ్డి విజయం సాధించిన నేపథ్యంలో మరో సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి పరకాల టికెట్ ఇవ్వాలని బిజెపి నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కళాకారుడు రసమయి బాలకిషన్కు టికెట్ ఇవ్వాలని, పోటీకి ఆయనను ఒప్పించాలని బిజెపి ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. తెరాస కూడా రసమయి బాలకిషన్ను పోటీకి దించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పరకాల అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో తెరాస, బిజెపి పరస్పరం మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. బిజెపి అభ్యర్థి ఖరారైన తర్వాత తమ అభ్యర్థిని ఖరారు చేయాలని తెరాస ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తెరాస అభ్యర్థి ఎవరనేది తెలుసుకున్న తర్వాత తమ అభ్యర్థిని నిర్ణయించాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.