'జగన్' జగతి ఖాతాల స్తంభన: స్పందించిన బాబు, బొత్స

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దొంగలు పడినట్లుగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్ల అవినీతిపై రాజా ఆఫ్ కరప్షన్ పేరిట పుస్తకాన్ని గతంలోనే ముద్రించిన టిడిపి కేంద్రానికి, రాష్ట్రపతికి, గవర్నర్కు ఇవ్వడం జరిగిందన్నారు. తాజాగా సిబిఐ చర్యలతో ఆనాడు టిడిపి చెప్పినవన్నీ వాస్తవాలని రుజువయ్యాయన్నారు.
ఎవరికైనా విచ్చలవిడితనం మంచిది కాదని, ఏదో ఒక రోజు చట్టానికి దొరకక తప్పదని హెచ్చరించారు. జగన్ సంపాదించిన అవినీతి సొమ్మును, అక్రమాస్తుల మొత్తాన్ని రెవెన్యూ యాక్ట్ ద్వారా రికవరీ చేసి పేదల సంక్షేమానికి ఖర్చు చేయాలని చంద్రబాబు సూచించారు. అవినీతి పేపర్ సాక్షికి నిధులు ఎక్కడి నుండి వచ్చాయని ఆయన ప్రశ్నించారు.
జగన్ పత్రిక, ఛానల్ బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేస్తూ సిబిఐ తీసుకున్న నిర్ణయంపై పిసిసి చీఫ్ బొత్సను విలేకరులు అభిప్రాయం కోరగా.. చట్టం తన పని తాను చేసుకు పోతోందని చెప్పారు. చట్టం తన పని తాను చేస్తోన్న సమయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. జగన్పై వచ్చిన అక్రమాస్తుల అభియోగాలపై రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ సమయంలో జగన్ దిన పత్రిక, టెలివిజన్లపై కాంగ్రెస్, టిడిపి కుట్ర పన్నాయంటూ జగన్ రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
చట్ట ప్రకారమే జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ల అకౌంట్లను సిబిఐ అధికారులు ఫ్రీజ్ చేశారని చెప్పారు. రాజకీయంతోనే ఆస్తులు సీజ్ చేస్తున్నారని, ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్నారని జగన్ పేర్కొనడం సహేతుకం కాదన్నారు. గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సత్యం సంస్థ పైనా ఇలాంటి విధానాన్నే అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అప్పట్లో సత్యం ఉద్యోగులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. భారత దేశంలో ఏ వ్యవస్థనైనా చట్ట ప్రకారమే నిర్వహించాల్సి ఉంటుందని చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. తన సంస్థలన్నీ చట్ట ప్రకారమే పని చేస్తున్నాయని నిరూపించుకోవాల్సిన బాధ్యత జగన్దేనని చెప్పారు.
ఖాతాలను స్తంభింపజేసినంత మాత్రాన పత్రికా స్వేచ్ఛను హరించడం కాదని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పత్రికా స్వేచ్చను జగన్ స్వార్థం కోసం వాడుకున్నారని ఆయన విమర్శించారు. ఖాతాలను సిబిఐ స్తంభింపజేయడం నూటికి నూరు శాతం కరెక్టేనని ఆయన అన్నారు. ప్రజల సొమ్మును హరించి జగన్ మీడియాను స్థాపించారని ఆయన అన్నారు. సిబిఐ ఈ పనిని ఎప్పుడో చేయాల్సిందని, ఇప్పటికే ఆలస్యం జరిగిందని ఆయన అన్నారు.
జగన్ ఆస్తుల కేసుల విషయంలో ఈ చర్యలు సరిపోవని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. దీన్ని ఆసరా చేసుకుని జగన్ రాజకీయ ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని ఆయన అన్నారు. జగన్ పత్రిక, ఛానల్ బ్యాంక్ అకౌంట్లను సిబిఐ సీజ్ చేయడం ద్వారా ఆయన పాపం పండినట్లయిందని టిడిపి అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద రావు అన్నారు.
చట్టం తన పని తాను చేస్తోందని కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెసుకు గానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ ఇందులో సంబంధం లేదని ఆయన అన్నారు. సత్యం రామలింగరాజు కేసులోనూ, 2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో గానీ ఇలాగే జరిగిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications