మీడియాతో జగన్ రాజకీయం: టిడిపి ఎంపిలు
అన్ని విషయాల్లో అందరినీ మోసం చేస్తామని అనుకుంటే కుదరదని వారు అభిప్రాయపడ్డారు. సాక్షి మీడియా ద్వారా తప్పుడు కథనాలు కథలు కథలుగా రాస్తున్నారని వారన్నారు. సిబిఐ విచారణలో మరిన్ని వాస్తవాలు బయటపడతాయని వారన్నారు. ప్రజాధనం దోపిడీ చేయడం ప్రారంభించినప్పుడే అరికట్టి ఉంటే బాగుండేదని వారన్నారు. ఉప ఎన్నికలకు వైయస్ జగన్ మీడియా బ్యాంకు ఖాతాల స్తంభనకు సంబంధం లేదని, అలా అనుకుంటే దౌర్భాగ్యమేనని వారన్నారు. ఉప ఎన్నికల్లో అవినీతి ఎజెండానే అని వారన్నారు.
వైయస్ జగన్ కాంగ్రెసు విషవృక్షం నుంచి పుట్టిన కొమ్మ అని వారు అభివర్ణించారు. సాక్షి మీడియా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం సమంజసమేనని, అవినీతి సొమ్ముతో సాక్షిని నెలకొల్పారని వారన్నారు. జగన్ మీడియాలోకి నిధులు ఎలా వచ్చాయో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దుష్ప్రచారం సాగిస్తూ జగన్ పబ్బం గడుపుతున్నారని వారన్నారు. వైయస్ జగన్ మాదిరిగా ఎవరూ బ్లాక్ మెయిల్ చేయకుండా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైయస్ జగన్ ప్రజాధనాన్ని లూటీ చేశారని వారు ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందిని తాము ఆనాడే చెప్పామని వారు చెప్పారు. మైనింగ్ దోపిడీతో భవిష్యత్తు తరాలకు ఇబ్బంది ఏర్పడుతుందని వారన్నారు. మిగతా పత్రికలకు ఇలా జరగలేదు కదా అని వారన్నారు. ఈ మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కూడా పాల్గొన్నారు. అయితే ఆయన ఏమీ మాట్లాడలేదు.