కాంగ్రెస్ జోక్యం చేసుకుంటే జగన్ జైలుకే!: తులసి రెడ్డి
ఒట్ల కోసమే జగన్ తన పార్టీకి కాంగ్రెసు పేరును తగిలించుకున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో తాము విఫలమవుతున్నామని ధర్మాన చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారం బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరిదే కాదన్నారు. నేతల అందరి పైనా బాధ్యత ఉంటుందని చెప్పారు.
వైయస్ జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని తులసి రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయింది తమ పార్టీ కాదని జగనే అన్నారు. ఇతర పార్టీలతో కుమ్మక్కయ్యే అవకాశవాద రాజకీయాలకు పాల్పడేది జగన్ అన్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో వైయస్ విజయమ్మ టిడిపితో చేతులు కలిపిందని, గతంలో టిడిపి చేతులలోని సమైక్య ప్లకార్డులు లాక్కొని జగన్ పార్లమెంటులో ప్రదర్శించారని గుర్తు చేశారు.
సిబిఐ విచారణలో కాంగ్రెసు జోక్యం చేసుకొని ఉంటే జగన్ ఎప్పుడో జైలుకు వెళ్లే వాడన్నారు. సాక్షికి ప్రభుత్వం ప్రకటనలు ఎలా వచ్చేవని ప్రశ్నించారు. మొదట్లో ధైర్యంగా విచారణనను ఎదుర్కొంటానని ప్రకటనలు చేసిన జగన్ ఇప్పుడు పిరికిపందలా మీడియా స్వేచ్ఛ అనే రక్షణ కవచం కింద తలదాచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
జగన్ మీడియా ఖాతాలు స్తంభింపజేయడంపై జగన్ కోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణ రెడ్డి పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కక్ష్య సాధింపు చర్య కాదన్నారు. ఈ వ్యవహారంలో సిబిఐ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వానికి సంబంధంలేదని, సిబిఐ దర్యాప్తులో భాగమే అని గండ్ర స్పష్టం చేశారు.
సీఎల్పీలో కొందరు సీనియార్ నేతలు పార్టీ ఇమేజ్ను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్నారు. సిఎల్పీ వేదికపై శంకర రావు లాంటి సీనియర్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అయినా వినకుంటే అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని గండ్ర వెంకట రమణ హెచ్చరించారు.
జగన్ మీడియా సంస్థల ఫ్రీజ్ వ్యవహారంపై జగన్ వర్గం నేతలు చేస్తున్న ఆరోపణలపై ఎంపి మధుయాష్కీ న్యూఢిల్లీలో స్పందించారు.జగన్ అక్రమాస్తులకు కాపాడుకోడానికే ప్రతికా స్వేచ్ఛ అంటూ జగన్ వర్గం నేతలు గగ్గోలు పెడుతున్నారని, ప్రతికా స్వేచ్ఛ ఇప్పుడు గుర్తొంచిందా అని మధుయాష్కి ప్రశ్నించారు.