స్తంభన కాదు, జగన్ మీడియానే క్లోజ్ చేయాలి: గాలి
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజాధనాన్ని లూఠీ చేసి మీడియా సంస్థలు స్థాపించారని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పిందన్నారు. వైయస్ జగన్ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాలూచీ పడ్డారని మండిపడ్డారు. వివాదాస్పద అక్రమ జివోలు కిరణ్ ఎందుకు ఇప్పటి వరకు రద్దు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
బ్యాంకు ఖాతాల స్తంభన సిబిఐ విచారణలో ఓ భాగమేనని శ్రీకాకుళం జిల్లాలో మరో నేత ఎర్రన్నాయుడు అన్నారు. జగన్ అక్రమాల వెనుక ఎంతోమంది పెద్దలు ఉన్నారని ఆరోపించారు. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ అవినీతి పునాదులపై పుట్టాయన్నారు. ఖాతాలు స్తంభింప చేసినంత మాత్రాన బ్లాక్ డే అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి-9 తనను ఒంటరివాడ్ని చేసి ఆడిస్తున్నాయనడాన్ని తప్పు పట్టారు.
2004లోనే రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని ముద్రించి లోకసభలో పంచిపెట్టామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోనందునే హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. దానిపై స్పందించిన కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడంతోనే అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయన్నారు. సిబిఐ తప్పు చేసిందనిపిస్తే జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్నారు.
జగన్ తన ఆస్తులలో సగం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, కాంగ్రెసు నేతలకు ముట్ట చెప్పారని కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో ఆరోపించారు. ఆందుకే అతనిని ఇప్పటి వరకు అరెస్టు చేయడం లేదని మండిపడ్డారు.