ఆగని దాడి, డబ్బులపై చిరు చెప్పాల్సిందే: అంబటి

కూతురు ఇంట్లో ఐటి అధికారులకు దొరికిన 35 కోట్ల రూపాయలు ఎక్కడివో చెప్పాలని ఆయన చిరంజీవిని డిమాండ్ చేశారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఆ డబ్బు ఎక్కడిదో చెప్పిన తర్వాతనే చిరంజీవి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడాలని ఆయన అన్నారు.
జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయలు సంపాదించారని తప్పుడు ప్రచారం చేయడానికి అందరూ అలవాటు పడ్డారని ఆయన అన్నారు. జగన్ వద్ద నల్లధనం ఒక్క రూపాయి కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. జగన్ వద్ద గానీ, జగన్ బంధువుల వద్ద గానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోలేదని ఆయన గుర్తు చేశారు.
చిరంజీవి నిజాయితీపరుడు కాదని అందరికీ తెలుసునని ఆయన అన్నారు. కూతురు ఇంట్లో దొరికిన 35 కోట్ల రూపాయలు చిరంజీవివేనని ఆయన అన్నారు. వ్యాపారం చేసుకునేవారు 35 కోట్ల రూపాయలు మంచం కింద పెట్టుకుంటారా అని ఆయన అడిగారు. చిరంజీవి బంధువుల ఇళ్లపై దాడులు చేస్తే వందల కోట్ల రూపాయల నల్లధనం బయటకు వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications