విమాన ప్రమాదం: మృతుల్లో బాలనటి, ఇద్దరు సేఫ్
విమాన ప్రమాదంలో మరణించిన 15 మందిలో 13 మంది భారతీయులు. ఆరుగురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. నేపాల్లోని పర్వత ప్రాంతంలో విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. పైలట్ పిఎస్ పాఠక్, కో పైలట్ ఎస్డి మహరాజన్ కూడా ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, ఇద్దరు భారతీయ బాలికలు ప్రాణాలతో బయట పడ్డారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినవారిలో ఈ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారిలో ఒక బాలిక వయస్సు ఆరేళ్లు కాగా, మరో బాలిక వయస్సు తొమ్మిదేళ్లు. వారు స్పృహలోనే ఉన్నారని, వారికి ప్రమాదం లేదని భారత దౌత్య కార్యాలయం అధికార ప్రతినిధి అపూర్వ శ్రీవాస్తవ చెప్పారు.
తమను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లాలని ఆ బాలికలు చెన్నైలోని తమ అంకుల్ కె. శ్రీనివాసన్ను కోరారు. ఈ ప్రమాదంలో తల్లి ఎస్ లత మరణించిందనే విషయం ఆ బాలికలకు తెలియదు. తండ్రి కెటి శ్రీకాంత్ మణిపాల్ ఆస్పత్రిలో స్పృహ లేకుండా పడి ఉన్నాడు.
దక్షిణ భారతదేశం నుంచి యాత్రకు వచ్చిన బృందంలో వీరున్నారు. వారు పవిత్ర ముక్తినాథ్ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. శ్రీకాంత్ పెద్ద కూతురు శ్రీవర్ధని కుడి కంటికి దెబ్బ తాకింది. చిన్న కూతురు శ్రీపాద కుడి కాలు ఫ్రాక్చర్ అయింది.