South Coast Railway Zone: అమల్లోకి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ..! విశాఖలో కొత్త చరిత్ర..!
ఏపీ విభజన చట్టంలో కీలక హామీ అయిన విశాఖ రైల్వే జోన్ (South Coast Railway Zone) అమల్లోకి వచ్చేసింది. జూన్ 1 న దీన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. దీంతో కొత్త జోన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. దీని ఏర్పాటుతో దేశంలో రైల్వే జోన్ల సంఖ్య 18కి పెరగనుంది. మే 4న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా దీన్ని అధికారికంగా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో జరిగే మార్పులు ఓసారి చూద్దాం..
కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో మొత్తం నాలుగు డివిజన్లు ఉంటాయి. ఇవన్నీ దక్షిణ మధ్య రైల్వే నుంచి కలిసిన విజయవాడ, గుంటూరు, గుంతకల్ తో పాటు కొత్తగా సృష్టించిన విశాఖపట్నం డివిజన్. దక్షిణ కోస్తా రైల్వే జోన్ 3,532 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ను కలిగి ఉంటుంది. దీని పరిధిలో మొత్తం 385 రైల్వే స్టేషన్లు ఉంటాయి. విశాఖపట్నం డివిజన్ను, పూర్వపు తూర్పు తీర రైల్వేలోని వాల్తేర్ డివిజన్లో ఒక భాగంగా పునర్వ్యవస్థీకరించారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలోని ముడసర్లోవలో నిర్మించాలని ప్రణాళిక చేశారు. ప్రతిపాదిత భవనం 12 అంతస్తుల నిర్మాణం. దీని అంచనా వ్యయం ₹183 కోట్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 8న ఈ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు.. ఈ జోన్ సిరిపురంలోని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన 'ది డెక్' భవనం నుండి పనిచేస్తుంది.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు తర్వాత భారతీయ రైల్వే మే 27న కొత్త 18-నక్షత్రాల లోగోను ఆవిష్కరించింది. ఈ లోగో కొత్త రైల్వే జోన్ చేరికకు అనుగుణంగా ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో రైల్వే పరిపాలన కోసం నాలుగు డివిజన్లు ఒకే జోన్ పరిధిలోకి వచ్చాయి. దీంతో పాలనలో ఇబ్బందులు కూడా లేకుండా సాఫీగా సాగనుంది. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖ-విజయవాడ బుల్లెట్ ట్రైన్ తో పాటు పలు కొత్త రైళ్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో విశాఖ వాసులకు ప్రయాణ ఇబ్బందులు గణనీయంగా తొలగిపోనున్నాయి.












Click it and Unblock the Notifications