బ్లాక్ మెయిల్ తో జెత్వానీ కోట్లు వసూలు - సీఐడీ చార్జిషీటు..!!
రాష్ట్రంలో సంచలనంగా మారిన జెత్వానీ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. ఆ తరువాత ఆ కేసును సీఐడీకి బదలాయించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఐపీఎస్ లపైనా చర్యలు తీసుకున్నారు. అయితే.. జెత్వానీ పైన నమోదైన కేసులో సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో విద్యాసాగర్ ను బ్లాక్ మెయిల్ చేసి జెత్వానీ కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.
మంబాయి మోడల్ కాదంబరి జెత్వానీ బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయాలు వసూలు చేసినట్లు సీఐడీ గుర్తించింది. వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ను బెదిరించి డబ్బు వసూలు చేసిందని సీఐడీ పేర్కొంది. ఈ మేరకు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటు లో పలు అంశాలను ప్రస్తావించింది. విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరక 2024 ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. క్రిమినల్ కుట్ర, బలవంతపు వసూళ్లు (ఎక్స్టార్షన్), మోసం, ఫోర్జరీ, బెదిరింపుల ఆరోపణలతో ఈ కేసును రిజిస్టర్ చేసారు. జెత్వానీతో పాటుగా, ఆమె తండ్రి నరేంద్రకుమార్, తల్లి ఆశా, సోదరుడు అంబరీశ్పై ఈ కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. విజయవాడ నాలుగో అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో పలు విషయాలను వెల్లడించింది. గుజరాత్కు చెందిన కాదంబరి నరేంద్ర కుమార్ జెత్వానీ 2009లో మిస్ గుజరాత్ కిరీటాన్ని గెలుచుకుంది. సినిమాల్లో నటించేందుకు ముంబైకి చేరిన ఆమె అక్కడ ఒక ప్రైవేటు కార్యక్రమంలో కుక్కల విద్యాసాగర్కు పరిచయమైనట్లు వివరించింది.

సీఐడీ విచారణలో కీలక విషయాలు
విద్యాసాగర్ తో పరిచయం కొనసాగించే క్రమంలో తన పేరు నటాషా అని.. మొబైల్ ఫోన్ పోయిందంటూ జెత్వానీ చెప్పినట్లు పేర్కొంది. తాను వైద్య విద్యార్థిని అని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పినట్లుగా వివరించింది. తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడడంతో హోటల్కు వెళ్లారని.. సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసి.. ఆయన్ను బ్లాక్మెయిల్ చేశారని పేర్కొంది. ముంబై సినీ పరిశ్రమలో చాలా మంది తాను చెప్పినట్లు విని డబ్బులు జమ చేస్తుంటారని, తన సోదరుడు అంబరీశ్ దుబాయ్లో రియట్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని.. ఆయనకు అండర్వరల్డ్తో సంబంధాలు ఉన్నాయని, తన మాట వినకుంటే ఆయన ఇండియాకు వచ్చాక ప్రాణాలు తీయిస్తానని కాదంబరి హెచ్చరించినట్లు వివరించింది. 2013 మే 14న రూ.లక్ష, 2015 అక్టోబరులో రూ.50 వేలు, 2015 మార్చి, ఏప్రిల్లో రూ.4.20 లక్షలు, 2018లో రూ.లక్ష, 2023లో మరో లక్షన్నర.. విడతలవారీగా విద్యాసాగర్ నుంచి రూ.6.70 లక్షలు వసూలుచేసినట్లు ఛార్జ్ షీట్ లో వివరించారు.
విద్యాసాగర్ను బెదిరించడానికి 11 సెల్ఫోన్ నంబర్లు ఉపయోగించారని వెల్లడించింది. కోటి రూపాయాలు ఇవ్వాలనే డిమాండ్తో బెదిరింపులను జెత్వానీ తీవ్రతరం చేసినట్లు వెల్లడించింది. ఫోన్లు చేసి వ్యక్తిగత ఫొటోలు బయటపెడతానని, అత్యాచారం కేసు పెడతానని బెదిరించినట్లు తెలిపింది. కాగా.. విద్యాసాగర్ ఫిర్యాదుతో జెత్వానీపై కేసు నమోదయ్యాక.. కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు అత్యుత్సాహంతో చట్టవిరుద్ధంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ముంబై వెళ్లి మరీ జెత్వానీని అరెస్టుచేసి తీసుకొచ్చారు. రిమాండ్పై జైలుకు పంపారు. బెయిల్ వచ్చాక ఆమె ముంబై వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై ఆమె కంప్లయింట్ ఇచ్చారు. ఇందులో వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్, పీఎస్ఆర్ ఆంజనేయులు (ఏ2), కాంతిరాణా తాతా, కె.హనుమంతరావు, విశాల్ గున్నీని నిందితులుగా పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించి సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. పీఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్నీని సస్పెండ్ చేసింది. ఈ కేసులోనూ సీఐడీ విచారణ పూర్తి చేసి కోర్టుకు చార్జిషీటు దాఖలు చేయగా.. కోర్టు రిటర్న్ చేసింది. దీంతో.. త్వరలో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది.












Click it and Unblock the Notifications