జగన్కు ఇద్దరే చిక్కారు, ఆలస్యంగా గుర్తించాం: బొత్స
ఉప ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం కాంగ్రెసు పార్టీకి లేదన్నారు. ఉప ఎన్నికలు యథావిథిగా జరుగుతాయని చెప్పారు. వైయస్ జగనే ఉప ఎన్నికలు వాయిదా వేయించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు రాజకీయ పార్టీల ముసుగులో అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. సంఘ విద్రోహశక్తులు ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు.
ఎన్నికలు వాయిదా పడాలన్నదే జగన్ ఆకాంక్ష అని అందుకే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు ఆయన లేఖ రాశారన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో తన పత్రికలో ఏం రాసినా చెల్లుతుందనే ధైర్యం జగన్కు ఉందన్నారు. ఆయన తన పత్రికలో తల పొగరుతో ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. జగన్ను సిబిఐ అరెస్టు చేస్తే ఆర్టీసి బస్సుల విధ్వంసానికి వైయస్సార్ కాంగ్రెసు కుట్ర చేసిందన్నారు.
హైదరాబాదు పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకున్నారని గుర్తు చేశారు. పోలీసుల అదుపులో ఉన్నది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలే అన్నారు. జగన్కు రోజు రోజుకు సానుభూతి తగ్గుతోందన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా ఉప ఎన్నికలు జరిగి తీరుతాయన్నారు. జగన్కు ఎంపి టిక్కెట్ ఇచ్చినప్పుడు ఆయన నేర ప్రవృత్తి తెలియదన్నారు. తాము ఆలస్యంగా దానిని గుర్తించామన్నారు. తమ కంటే ముందు కోర్టులే జగన్ స్వభావాన్ని గుర్తించాయన్నారు.
జగన్ పూర్తిగా అవినితి ఆరోపణలలో కూరుకు పోయారన్నారు. ఆరోపణల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారన్నారు. రెండు మూడు నెలలుగా 30 మంది ఎమ్మెల్యేలతో జగన్ భేరసారాలు జరిపారని, అయితే జగన్ వలలో ఇద్దరే చిక్కారన్నారు. ఇక నుండి పార్టీ వీడితో 2014 వరకు పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని స్పీకర్కు అఫిడవిడ్ సమర్పిస్తామన్నారు. కాగా హైదరాబాదు పోలీసులు శనివారం బస్సుపై దాడి కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.