ఏ క్షణంలోనైనా జగన్ అరెస్టని ఊహాగానాలు, హై అలర్ట్

అయితే ఆదివారం మధ్యాహ్నం పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమవడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఉదయం జగన్ సిబిఐ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మధ్యాహ్నం సమయంలో ఉన్నతాధికారులు.. హైదరాబాదులో సెలవులలో ఉన్న పోలీసులను తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. విచారణ నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. విధులలో ఉన్న సిబ్బంది అలెర్ట్ కావాలంటూ ప్రత్యేక ఆదేశాలు వెలువడినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పోలీసులు బలగాలు మరింత అప్రమత్తమయ్యాయని తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు.
అయితే మొత్తం మీద ఏదో రహస్య సమాచారం చక్కర్లు కొడుతోందని అంటున్నారు. దిల్కుషా అతిథి గృహం వద్ద బయట ఉన్న జగన్ వర్గం నేత హడావుడిగా తిరగడం ఆసక్తి రేకెత్తించిందని అంటున్నారు. అయితే ఈ అప్రమత్తత, హడావుడి సోమవారం జగన్ కోర్టుకు హాజరయ్యేందుకు కూడా కావొచ్చునని, అరెస్టు కోసమే కాదనే వాదనలూ వినిపిస్తున్నాయి. కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో జగన్ రేపు కోర్టుకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా పోలీసులను రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తం చేసి ఉండవచ్చునని అంటున్నారు. పలు కూడళ్లలో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం వద్ద, జగన్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. జడ్జిల ఇళ్ల వద్ద భద్రత ఏర్పాటు చేశారు.
కాగా జగన్ను సిబిఐ ఆరు గంటలుగా విచారిస్తోంది. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని కూడా విచారించారు. నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను జగన్ సమక్షంలో పెట్టుబడులకు సంబంధించి ముఖాముఖి ప్రశ్నలు వేసినట్లుగా సమాచారం. తొలి రోజు శుక్రవారం జగన్ను సిబిఐ ఎనిమిది గంటలు విచారించింది. రెండో రోజు ఏడున్నర గంటలు విచారించింది. ఈ రోజు కూడా సాయంత్రం ఆరు గంటల వరకు విచారించే అవకాశముందని అంటున్నారు.












Click it and Unblock the Notifications