జగన్ చెప్పారు, సాయిరెడ్డినీ పిలిచారు: కేర్కు మోపిదేవి

గత రెండు రోజులుగా సిబిఐ విచారణలో జగన్ తెలిపిన సమాచారం మేరకే విజయ సాయిని పిలిపించినట్లుగా సమాచారం. కంపెనీలలోకి వచ్చిన పెట్టుబడులు, ఆర్థిక వ్యవహారాలపై రెండు రోజులుగా సిబిఐ జగన్ను ప్రశ్నించింది. అయితే పూర్తి ఆర్థిక వ్యవహారాలు విజయ సాయికే పూర్తి తెలుసునని విచారణలో జగన్ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆదివారం అతనిని కూడా సిబిఐ పిలిపించింది.
జగన్ ఆర్థిక వ్యవహారాలపై పూర్తిగా ఆరా తీసేందుకే సిబిఐ వారిద్దరినీ ఒకే దగ్గర ఉంచి విచారిస్తున్నారని సమాచారం. ఇప్పటికే సిబిఐ విజయ సాయి, జగన్ నుండి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఇరువురిని కలిపి మరింత లోతుగా వారు విచారిస్తున్నారని తెలుస్తోంది. జగన్ కంపెనీల ఆర్థిక లావాదేవీలు ఆయన కంటే సాయికే ఎక్కువ తెలుసునని అంటున్నారు. జగన్, సాయి రెడ్డిలని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ విచారిస్తున్నారని తెలుస్తోంది.
కాగా నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను కూడా సిబిఐ తొమ్మిదో రోజు విచారిస్తోంది. వారి కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. మరోవైపు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతనిని కేర్ ఆసుపత్రికి తరలించారు. అతను హైబిపితో బాధపడుతున్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. శనివారం సాయంత్రం నుండే అతను నీరసించి పోయారని తెలుస్తోంది. వైద్య చికిత్స అనంతరం అతనిని సిబిఐ కార్యాలయానికి తీసుకు వచ్చి అధికారులు విచారించనున్నారు. వైద్యులు అతనికి ఈసిజి, ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించారు.
మోపిదేవి వెంకటరమణ గతంలో న్యూరాలజీ సమస్యతో బాధపడినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆయన తాను చేయని తప్పుకు శిక్ష అనుభవించుతున్నానని తీవ్ర ఆవేదన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. నాయకుడు చెప్పినట్లుగా చేసినందుకు తాను ఇంత అనుభవిస్తున్నానని ఆయన తీవ్ర ఒత్తిడికి లోనయి ఉంటారని అంటున్నారు. శనివారం తనను కలిసిన మంత్రులతో మోపిదేవి ఇదే చెప్పినట్లుగా సమాచారం. అందుకు వారు నిర్దోషిగా తిరిగి వస్తావని ఆయనకు ధైర్యం చెప్పారని అంటున్నారు.
కాగా మోపిదేవి వెంకటరమణ కుటుంబ సభ్యులను రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, మంత్రి గంటా శ్రీనివాస రావు పరామర్శించారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడారు. మోపిదేవి త్వరలో నిర్దోషిగా బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బిసి కావడం వల్లనే మోపిదేవి బలయ్యారని తాను అనుకోవడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఏకపక్ష నిర్ణయాలకు మోపిదేవి బలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోపిదేవి కుటుంబానికి అందరం బాసటగా ఉంటామన్నారు.












Click it and Unblock the Notifications