రాజా ఆఫ్ కరప్షన్ మాటేమిటి?: మైసూరా రెడ్డికి టిడిపి

అత్యున్నత పదవులు, అమితమైన గౌరవం ఇచ్చిన పార్టీని వీడడం ద్వారా తన స్వార్థ రాజకీయాన్ని బట్టబయలు చేసుకున్నాడన్నారు. కడప జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. 2004లో తెదేపాలో వేల సంఖ్యలో కార్యకర్తలతో చేరిన మైసూరాకు వైవి సుబ్బారెడ్డి కండువా వేసి జగన్ పార్టీలో చేర్చుకోవడం చిన్నతనంగా అనిపించలేదా అని ప్రశ్నించారు.
పార్టీలో చేరగానే ఎంపి టికెట్, పొలిట్ బ్యూరో సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసిన తెలుగుదేశాన్ని వీడాలని ఎలా అనిపించిందో అర్థం కావడం లేదన్నారు. కొడుకులాంటి జగన్ సహాయం చేయమని అడిగాడంటూ కథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాజా అఫ్ కరప్షన్ పుస్తకాన్ని ఆయన నేతృత్వంలోనే సిబిఐ, ప్రధాన మంత్రి, రాష్ట్రపతికి అందజేశామన్నారు. మరి ఇప్పుడు వైయస్ ఒక్కసారిగా మంచివాడు ఎలా అయ్యాడో మైసూరాకే తెలియాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి జగన్ పార్టీలో చేరినప్పుడు డబ్బు మూటలకు అమ్ముడుపోయాడని చెప్పిన మైసూరా ఇప్పుడు ఎన్ని మూటలకు అమ్ముడుపోయాడో చెప్పాలన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం జగన్ పంచన చేరాడన్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డిని సైతం జగన్ పార్టీలోకి మైసూరా ఆహ్వానించినట్లు ఆయన చెప్పాడన్నారు. జిల్లాలో జరగనున్న మూడు అసెంబ్లీ ఎన్నికలలో మైసూరా ప్రభావం ఏ మాత్రం ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పాలెగాళ్ళ పాలన వద్దన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారని, మూడు నియోజకవర్గాల్లో విజయం తెలుగుదేశందేనని అన్నారు. వైయస్ వివేకా, జగన్లపై పోటీ చేసి వైయస్ కుటుంబ అవినీతిపై పోరాటం చేసిన మైసూరా పార్టీ మారడం వ్యక్తిగతంగా ఆయనకే నష్టమని ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి చెప్పారు. వ్యక్తులు పోయినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదని ఎన్ని ఒడుదొడుకులనయినా ఎదుర్కొనే శక్తి టిడిపికి ఉందన్నారు. అవినీతిపై పోరాటం చేసిన తనను వైయస్సే ఆరు నెలల పాటు జైలు పాలు చేశారన్నారు.
అటువంటి చరిత్ర వున్న జగన్ పంచన చేరడం మైసూరా రాజకీయ స్వార్థానికి నిదర్శనమని చెప్పారు. అనంతరం వైయస్ కుటుంబంపై గతంలో మైసూరా చేసిన ఆరోపణల పేపర్ కటింగులను విలేకరులకు చూపించారు. ముడుపుల సొమ్ముతో నెలకొల్పిన జగన్ పత్రిక హిట్లర్ నాటి గోబెల్స్ స్థాపించిన డెర్ యాంగ్రిఫ్(ది అటాక్) పత్రికలాంటిదని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హైదరాబాదులో అన్నారు.
హిట్లర్ను అధికారంలో కొనసాగించడమే లక్ష్యంగా ప్రజలను మభ్యపెట్టిన యాంగ్రిఫ్ మాదిరిగానే జగన్ పత్రిక కూడా పయనిస్తోందని ధ్వజమెత్తారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హిట్లర్ పత్రిక పేరు ఎదురు దాడి(ది అటాక్) కాగా జగన్ పత్రిక వ్యూహమే ఎదురు దాడి అని, దాంతోనే రోజూ విష ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి జగన్ అవినీతిని కప్పిపుచ్చేందుకు వృథా ప్రయాస పడుతోందన్నారు.
సాక్ష్యాధారాలతో సహా సిబిఐ వేసిన చార్జిషీట్పై, అవాస్తవాలు రాస్తూ ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఆ పత్రిక చేస్తున్న యత్నాలు ఫలించవన్నారు. తమ పార్టీ నేతలు ఒకరినో, ఇద్దరినో ప్రలోభపెట్టినంతమాత్రాన టిడిపికి నష్టం లేదని యనమల చెప్పారు.
కాగా రాష్ట్రాన్ని కాపాడుకొందాం.. రండి అన్న నినాదంతో ప్రస్తుత ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇదే నినాదంతో రూపొందించిన ప్రచార సిడిలను శనివారం ఇక్కడ ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. 'రైతుల సమస్యలు, సెజ్ల పేరుతో భూములు సేకరించి బడా బాబులకు పందారం, వ్యాన్పిక్ ప్రాజెక్టు పేరుతో రైతుల పొట్టగొట్టడం, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, కరెంటు ఛార్జీలు, పత్తి రైతులు.. చేనేత కార్మికుల ఆకలి చావులు, లక్ష కోట్ల ప్రజా ధనం లూఠీ, ఫ్యాక్షన్ ముఠాల దందాలు, అవినీతి అక్రమాలు, భూ కుంభకోణాలు, పెరుగుతున్న ధరలు.. వంటి సమస్యలను ఇందులో ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications