కడప గూండాలు: జగన్‌పై బాబు ఫైర్, మైసూరాపై సెటైర్

Chandrababu Naidu
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేస్తే హైదరాబాదులో అల్లర్లు సృష్టించేందుకు కడప గూండాలను రాజధానికి రప్పించారని, ఇది జగన్ నీచ చరిత్ర అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. ఆయన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వంద బస్సులను తగులబెట్టేందుకు కుట్ర పన్నారని, పోలీసుల దర్యాప్తులో ఇప్పటికే ఇది బహిర్గతమైందన్నారు.

ఇదీ జగన్ నీచ చరిత్ర అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క వాన్‌పిక్ ప్రాజెక్టులోనే రూ.855 కోట్లు దోచుకున్న గజదొంగ జగన్ అని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో పేపరు, టివి పెట్టి అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి అవినీతి సాక్షిని చదవకండి, చూడకండి అంటూ హితవు పలికారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇంటింటికీ పేపర్లు ఉచితంగా ఇస్తున్నారని, అవి పొట్లాలు కట్టుకునేందుకు బాగా ఉపయోగపడుతున్నాయని ఎద్దేవా చేశారు.

2004కు ముందు అప్పుల ఊబిలో ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి అనతికాలంలోనే లక్షల కోట్లు సంపాదించారని, ఆయనను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన మంత్రుల్లో ప్రస్తుతం ఒక్కరే అరెస్టయ్యారని, అందరినీ అరెస్టు చేస్తే చంచలగూడ జైలు కూడా చాలదని ఎద్దేవా చేశారు. నేర చరితులతో జగన్ కుమ్మక్కై రాష్ట్రాన్ని హస్తగతం చేసుకునేందుకు తపన పడుతున్నారన్నారు.

తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సీఎం పదవి కోసం తాపత్రయపడిన ప్రబుద్ధుడు జగన్ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో 1982 నాటి పరిస్థితులు నెలకొన్నాయని, ర్రాష్టాన్ని కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని, తెలుగుదేశంను దెబ్బ తీసేందుకు కుట్ర పన్నాయని ఆరోపించారు. జగన్ విషయంలో ఇప్పటి వరకు కాలయాపన చేసి ఎన్నికలు జరిగే సమయంలో టిడిపి గెలుస్తుందనే భయంతో సిబిఐ పేరుతో కాంగ్రెస్ దొంగాట ఆడుతోందని విమర్శించారు.

ఎప్పటికైనా ఆ రెండు పార్టీలు ఒకటి కావడం ఖాయమన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా లీటర్ పెట్రోల్‌పై రూ.8.50 పెంచి సామాన్యుడి నడుం విరగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. పెంచిన పెట్రోల్ ధరలకు నిరసనగా ఎడ్లబండి ఎక్కి కొద్దిసేపు ప్రచారం చేశారు. రాయితీలు ఇచ్చి ధరను కొంత మేరకైనా తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. అధికారంలోకి వస్తే పెట్రోల్‌పై పది శాతం వ్యాట్ పన్ను తగ్గిస్తామని చెప్పారు.

చెట్టు పెరిగినప్పుడు ఎండిపోయిన ఆకులు రాలి పడిపోతుంటాయని, వాటి స్థానంలో కొత్త చివుళ్లు వస్తాయని, మైసూరా రెడ్డి వంటి వాళ్ల ఉద్వాసన కూడా అంతే అని ఎద్దేవా చేశారు. వారు పార్టీని వీడినా నష్టం లేదన్నారు. ఒకరిద్దరు పోయినంత మాత్రాన బలహీనపడే స్థితిలో టిడిపి లేదన్నారు. అరెస్టు భయంతో ఉన్న జగన్ ఇతర పార్టీల నుంచి ఒకరిద్దరిని కొనుగోలు చేసి రాజకీయ వర్గాల్లో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

పార్టీని ఫిరాయించిన వారు చరిత్రహీనులుగా మిగులుతారని మైసూరాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అవినీతితో లక్ష కోట్లు సంపాదించుకొని రాష్ట్రంలో లక్ష వైయస్సార్ విగ్రహాలను ఏర్పాటు చేశారని జగన్‌ను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలే వైయస్‌ను పెంచి పోషించారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+