జగన్ను అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో ఇద్దరు మృతి
నల్గొండ జిల్లాలో కూడా మరో వ్యక్తి మృతి చెందాడు. కోదాడ మండలం రెడ్లకుంటలో అనంతయ్య అనే 55 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా జగన్ను అరెస్టు చేయవచ్చుననే ఊహాగానాలను ఆయన చూస్తున్నారు. మూడు రోజులుగా జగన్ సిబిఐ విచారణకు హాజరవుతున్నారు. అతనిని ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చుననే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీందో ఆందోళన చెందిన అనంతయ్య గుండెపోటుతో మృతి చెందాడు.
కాగా రెండు రోజుల క్రితం కూడా జగన్ మొదటి రోజు విచారణకు హాజరైనప్పుడు ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందినట్లుగా సాక్షి మీడియాలో వార్తలు వస్తున్నాయి. జిల్లాకు చెందిన వెదురుకుప్పం మండలం చౌడేపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉదయం టివి చూస్తూ మృతి చెందాడు. ఇతని వయస్సు 42. మృతునికి ముగ్గురు కుమార్తెలు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
చిత్తూరు జిల్లాలోనే జగన్ను అరెస్టు చేస్తారనే ఆందోళనతో మనస్థాపం చెంది మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. వెదురుకుప్పం మండలానికే చెందిన నడుమూరు గ్రామానికి చెందిన 29 ఏళ్ల ఈశ్వర రెడ్డి విషం తాగి ఈ ఘటనకు పాల్పడ్డాడని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో కాల్వ లక్ష్మయ్య(60) అనే వ్యక్తి కూడా గుండెపోటుతో మృతి చెందాడని తెలుస్తోంది.
మూడు రోజులుగా లక్ష్మయ్య టివీలలో వైయస్ జగన్ను అరెస్టు చేస్తారనే ప్రచారాన్ని చూస్తున్నారు. ఉదయం కూడా ఆయన టివి చూశాడు. శుక్రవారమే జగన్ సిబిఐ విచారణ ముందు హాజరవుతారని, అదే సమయంలో అతనిని అరెస్టు చేస్తే చేయవచ్చుననే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనిని చూసి ఆందోళన చెందిన లక్ష్మయ్య ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఎస్వి గ్రామంలోనూ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి జగన్ అరెస్టు ఆందోళనతో గుండెపోటుతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, ఆందోళన కూడా చెందవద్దని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.