అరెస్ట్ ఉండదు, సహనంతోనే..: జాతీయ ఛానల్తో జగన్

తనను ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకే సిబిఐ తన విచారణలో జాప్యం ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. సిబిఐ అధికారులు తనను పదే పదే వేసిన ప్రశ్నలే అడుగుతున్నారన్నారు. తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు తన కంపెనీలలోకి వచ్చిన పెట్టుబడులపై కూడా సిబిఐ ప్రశ్నిస్తోందని, అయినప్పటికీ తాను సహనంతో సమాధానం చెబుతున్నానని అన్నారు. లేదంటే తాను విచారణకు సహకరించడం లేదని వారు ఆరోపించే అవకాశముందన్నారు. కోర్టు సమన్లు ఇచ్చిన దృష్ట్యా సిబిఐ తనను అరెస్టు చేయదన్నారు.
సోమవారం తాను వ్యక్తిగతంగా కాని లేదా తన తరఫున లాయరు గానీ కోర్టుకు హాజరయ్యే అవకాశముందని వేరుగా చెప్పారని తెలుస్తోంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తన పార్టీలోకి చిత్తశుద్ధితో వచ్చే వారినే ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. ఉప ఎన్నికలలో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని చెప్పారు.
కాగా జగన్ గత మూడు రోజులుగా సిబిఐ విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే. శనివారం సిబిఐ విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విచారణ సాఫీగా సాగిపోతోందని చెప్పారు. సిబిఐ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇస్తున్నట్లు చెప్పారు. తనను మరోసారి విచారణకు పిలిచారన్నారు. తనను ఆదివారం మరిన్ని వివరాలు అడిగే అవకాశముందన్నారు.












Click it and Unblock the Notifications