లగడపాటి రిసార్ట్లో పేలుళ్లు, జగన్ వర్గం పనే... ఎంపి
ప్లాసిడా రిసార్ట్ను లగడపాటి సతీమణి పద్మ నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రెండు నెలలుగా ఇది వాడుకలో లేదు. కేవలం వాచ్మెన్ మాత్రమే అందులో నివాసం ఉంటున్నారు. గత వారం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రిసార్టులో ఒక్కసారిగా జిలెటిన్ పేలుళ్లు జరిగాయి. ఈ విషయాన్ని వాచ్మెన్ పోలీసులకు చెప్పారు.
జిలెటిన్ పేలుళ్ల కారణంగా ప్లాసిడా రిసార్ట్ పాక్షికంగా దెబ్బతిన్నది. సంఘటన స్థలంలో తెలంగాణవాదుల పేరిట కరపత్రాలు దొరికాయి. దీనిపై రాయదుర్గం పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం ఘటన జరిగినప్పటికీ మరిన్ని సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు దానిని గోప్యంగా ఉంచారు.
తన ప్లాసిడా రెస్టారెంట్లో జిలెటిన్ పేలుళ్లపై రాజమండ్రిలో ఉన్న లగడపాటి రాజగోపాల్ మంగళవారం స్పందించారు. తన రిసార్టులో పేలుళ్లకు కారణం తెలంగాణవాదులు కాదని, వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గీయులే అని అనుమానం వ్యక్తం చేశారు. తాను మొదటి నుండి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని, కానీ ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. తెలంగాణవాదులే చేయాలనుకుంటే ఎప్పుడో చేసే వారన్నారు. అయితే పోలీసుల విచారణలో పూర్తి విషయాలు వెల్లడవుతాయన్నారు.
ఒకవేళ తెలంగాణవాదులే చేస్తే వారి సాహిత్యం అక్కడ ఎందుకు వదిలి వెళతారన్నారు. తెలంగాణవాదుల పైకి దీనిని నెట్టేందుకే జగన్ వర్గీయులు ఇలా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో దాడులు జరిగినా ఇంత విధ్వంసంగా లేవన్నారు. తన రిసార్టుపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణవాదులకు ఆ అవసరం లేదని చెప్పారు. తనకు కూడా పేలుళ్ల విషయం ఆలస్యంగా తెలిసిందన్నారు.
కాగా గత కొద్ది రోజులుగా లగడపాటి రాజగోపాల్ యువనేత పైనా తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. జగన్పై లగడపాటి తీవ్రంగా ఎదురు దాడి చేస్తున్నారు. అదే సమయంలో పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఈ కారణంగానే జగన్ పార్టీ కార్యకర్తలు ఈ దాష్టీకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.