యాదృచ్ఛికమైనా ఆ తేదినే జగన్ జైలుకు: కోదండరామ్
వరంగల్ పై దండయాత్ర చేయడానికి వచ్చిన సీమాంధ్ర నేతను ఐక్యంగా తిప్పికొట్టినట్లుగానే మరోసారి ఐక్యంగా కొట్లాడాలని తెలపడానికే మానుకోట పోరాట స్ఫూర్తియాత్ర చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శక్తిమంతుడిగా భావిస్తున్న వ్యక్తిని మానుకోటలోని సాధారణ ప్రజలే తిప్పి కొట్టి తెలంగాణ ఆత్మగౌరవం కాపాడారన్నారు. 1970 నుండి తెలంగాణ వనరులను దోపిడీ చేసి, ఆస్తులు, పెట్టుబడులు పెంచుకుంటున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇందుకు రాజకీయాలను కూడా ఉపయోగించుకోవడం నేర్పారన్నారు. ఆయన కిటీకీలు తెరిస్తే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఏకంగా తలుపులే తెరిచారని మండిపడ్డారు. అక్రమాలలో భాగస్వాములైన మంత్రులు, సూత్రధారి కెవిపి రామచంద్ర రావును కూడా జైలుకు పంపాలన్నారు.
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నిజాయితీ బయటపడుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆ కుర్చీలో కూర్చున్నాక భార్య అయినా.. కుమారుడు అయినా అందరూ సమానంగా భావించాలని హితవు చెప్పారు. కాలిపోయి, చీలిపోయి, శిథిలమైపోయిన ఈ పాలనపై చివరిసారిగా ఓ ధక్కా ఇవ్వాలని, అప్పుడే ఆంధ్రాపాలన కూలిపోతుందని పిలుపునిచ్చారు.