జగన్ వస్తే ఉత్సాహం, విజయమ్మ వస్తే కసి: రోజా వ్యాఖ్య
ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులు బంపర్ మెజార్టీతో గెలుస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు ద్వారా తమ కార్యకర్తలను భయాందోళనకు గురి చేసి లబ్ధి పొందాలని కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. జగన్ అరెస్టు ద్వారా తమ పార్టీకి ఎలాంటి లబ్ధి లేదన్నారు. ప్రజలు ఎప్పటి నుండో జగన్కు మద్దతుగా నిలబడుతున్నారన్నారు.
ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తుందని కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన చంచల్గూడ జైలులో ఉన్న జగన్మోహన్ రెడ్డిని మధ్యాహ్నం కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాలలో విజయం సాధిస్తారని అన్నారు.
ఇదేం న్యాయమని ప్రశ్నించిన వారిపై కుట్రలు చేయడం, తమ వారు అనుకున్న వారిని వారు ఎలాంటి వారైనా అందలమెక్కించడం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి అలవాటుగా మారిపోయిందని మాజీ ఆర్టీసి చైర్మన్ గోనె ప్రకాశ్ రావు వేరుగా హైదరాబాదులో అన్నారు. జగన్ పైన జరుగుతున్న వేధింపుల పరంపర ఇందులో భాగమే అన్నారు. తనకు అడ్డమవుతుందన్న ఆలోచనలతో సాక్ష్యాత్తూ తోడి కోడలు మేనకా గాంధీనే ఇంటి నుండి వెళ్లగొట్టి సోనియా పుణ్యం కట్టుకుందన్నారు.
ఒక పెద్ద పార్టీకి అధినేతగా ఉండి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం తగదన్నారు. ఏఐసిసి అధ్యక్ష పదవి హుందాతనానికి ఆమె గండికొడుతున్నారన్నారు. సోనియా అండ ఉందన్న ధీమాతో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ లాంటి నేతలు కూడా లెక్కలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు.
అతిత్వరలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని రెహ్మాన్ అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై జగన్ పైన కుట్రలు చేస్తున్నాయన్నారు. జగన్కు దేవుడి దయ, ప్రజల అండ పుష్కలంగా ఉందన్నారు. జరగబోయే ఎన్నికలలో అన్ని స్థానాలలో గెలుపు మాదే అన్నారు.