జగన్ వస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు: షర్మిల ధీమా
ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే మీరంతా జగన్ను నీతిమంతుడిగా భావిస్తున్నట్లేనని, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్లేనని షర్మిల అన్నారు. సిబిఐ కేంద్రం ఆడించినట్లుగా ఆడుతోందని స్వయంగా ఆ సంస్థ మాజీ డైరెక్టరే చెప్పారని షర్మిల అన్నారు. సిబిఐని కేంద్ర ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్లుగా ఆడిస్తోందని విమర్శించారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ దెబ్బతీసేందుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేశాయన్నారు. వారి కుట్రలో భాగంగానే వైయస్ జగన్ అరెస్టయ్యారన్నారు. జగన్ ఏ తప్పు చేశారని జైలుకు పంపించారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల మది నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తీసి వేయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర పన్నుతున్నాయన్నారు.
వైయస్ పేరు విన్నా, జగన్ను చూసినా కాంగ్రెసు, టిడిపిలకు భయం అన్నారు. ఉప ఎన్నికలలో ఆయా పార్టీలకు ఒక్క సీటు కూడా రాదన్నారు. వారికి ధరావత్తు దక్కకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. మీ ఓటు ద్వారా ఊసరవెల్లి రాజకీయాలకు చెక్ చెప్పాలన్నారు. జగన్ చేపట్టిన ఓదార్పు వల్లనే కాంగ్రెసు అధిష్టానం తమను ఇబ్బంది పెడుతోందన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్ సిఎం కావాల్సిందే అన్నారు.