వైయస్ జగన్ స్వర్గం నుంచి దిగొచ్చాడా: ఆజాద్
"ఆర్థిక నేరాల కేసులో చాలామంది జైలుకు వెళ్లారు. కల్మాడీ, లాలూప్రసాద్, రాజా, నళిని, యడ్యూరప్ప.. అంతా జైలుకు వెళ్లారు. వీరిలో కాంగ్రెస్పార్టీ వారు, ప్రతిపక్షాల వారూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నారు. వీరికి వర్తించిన చట్టం జగన్కు వర్తించదా? వీరికి మించిన ఆర్థిక నేరాలకు పాల్పడిన జగన్ మీద చట్టం చర్యలు తీసుకోకూడదా? అసలు జగన్ ఏమనుకొంటున్నారు. తానేమైనా దేవదూత అనుకొంటున్నారా? స్వర్గం నుంచి దిగి వచ్చాననుకొంటున్నారా?'' అని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు.
కనిమొళి, రాజా కూడా జైలుకు వెళ్లారని, అయినా డిఎంకె యుపిఎకు మద్దతు ఉపసంహరించుకోలేదని ఆయన చెప్పారు. జగన్కు అనుభవం లేదు, కేంద్ర మంత్రి పదవి ఇస్తాం, దాని ద్వారా అనుభవం సంపాదించుకోవాలని చెప్పామని, అయినా జగన్ వినలేదని, ముఖ్యమంత్రి పదవి మీదనే జగన్ ఆశ పెట్టుకున్నారని ఆయన అన్నారు. బెంగళూరులో రూ. 600 కోట్లు, హైదరాబాద్లో రూ. 500 కోట్లతో భవనాలు కట్టుకున్నారని.. ఇవన్నీ చూస్తూ కోర్టులు, చట్టాలు కళ్లు మూసుకుని కూర్చోవాలని అనుకొంటున్నారా? అని ఆజాద్ ప్రశ్నించారు. ఈ భవనాలకు, ఆయన సంస్థల్లో పెట్టుబడులకు వేలాది కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలని కోర్టులు అడిగితే దానికి లెక్క చెప్పకుండా కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని చెబుతున్నారని, ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభించాల్సిందేనని ఆజాద్ అన్నారు.
"దివంగత సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి నాకు మంచి మిత్రుడు. ఆయన మరణంతో పార్టీ చాలా నష్టపోయింది. వ్యక్తిగతంగా నాకూ ఎంతో బాధేసింది. వైయస్ బాటలోనే జగన్ నడుస్తాడని భావించాం. ఏడాది పాటు కేంద్రమంత్రిగా పని చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆయనకు మంచి భవిష్యత్తు ఇచ్చేది. కానీ అధికారం కోసం జగన్ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించాడు. వైయస్ విజయలక్ష్మి నాకు సోదరి. ఇంత డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని ఆనాడే జగన్ను ఆమె ప్రశ్నించే ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు'' ఆయన అన్నారు.
2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు, నాలుగు కొత్త పథకాలను తీసుకువచ్చిందని ఆయన అన్నారు. అప్పట్లో కర్ణాటక ఇన్చార్జిగా వ్యవహరించిన తాను మైనార్టీలకు 4% రిజర్వేషన్ తీసుకురాగా, ఆంధ్రప్రదేశ్లో మరో శాతం పెంచి 5% అమలు చేయాలని సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పుడు దాన్ని తమ పథకమని ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. ఇక పింఛన్ల పథకానికి కేంద్రం తోడ్పాటు అందిస్తే మంచిదన్న ఆలోచన జమ్మూ కాశ్మీర్లో జరిగిందన్నారు.
దానికే రూపకల్పన చేసి కాంగ్రెస్ పథకంగా తీసుకొచ్చామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో ఉత్సాహంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు చెప్పారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి టీ సుబ్బరామిరెడ్డి చేసిన అభివృద్ధిని స్వయంగా విశాఖకు వెళ్లి చూసి వచ్చానని అన్నారు. అదే తరహాలో నెల్లూరులో కూడా అభివృద్ధి సాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
జగన్ చేసింది చిన్న చిన్న దొంగతనాలు కావని, వేల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని, ప్రజలు క ట్టిన పన్నులను కూడా దోచుకున్నారని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. దీనిపై కోర్టు ఆదేశాలతో జగన్ను సిబిఐ అరెస్ట్ చేసి జైలులో పెట్టిందని వివరించారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లి నీతిమాలిన పనికి అనర్హత వేటు పడితే వీరంతా త్యాగం చేసినట్లుగా ప్రచారం చేయడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు.
జగన్ది వైయస్సార్ పార్టీ కాదని, అది అవినీతి వైరస్ పార్టీ అని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ధ్వజమెత్తారు. చేసిన అవినీతి నుంచి బయట పడటానికి న్యాయస్థానాలను సైతం కలుషితం చేస్తున్న జగన్ వర్గీయులు అవకాశం దొరికితే సమాజంలోని ఏ వ్యవస్థనైనా, ఏ వ్యక్తినైనా నాశనం చేస్తారనే విషయం రుజువయ్యిందన్నారు. జగన్, గాలి జనార్దనరెడ్డి ఇద్దరు అవినీతికి కవల పిల్లలని విమర్శించారు. ఈ అవినీతికి అడ్డుకట్ట వేయగల శక్తి ప్రజలకే ఉందని, ఓటు అనే ఆయుధంతో ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
2009లో మేకపాటి సోదరులకు టికెట్ ఇచ్చినందుకు ప్రజలను క్షమాపణలు కోరుతున్నామని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసే డబ్బు మదంతో జగన్ వ్యవహరిస్తున్నాడని పార్టీ పేరే చెప్పుకోలేని జగన్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.