వైయస్సార్ చాపర్ క్రాష్ హాట్ బైపోల్ ఇష్యూ
తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి మృతి వెనక కుట్ర ఉందని, తన భర్త మరణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని వైయస్ విజయమ్మ తన ఎన్నికల ప్రచార సభల్లో అంటూ వస్తున్నారు. తన కుమారుడి జైలుకు, వైయస్ మృతికి సంబంధం అంటగడుతూ, వీటి వెనక కుట్ర ఉందని ఆమె ఆరోపిస్తుననారు. ఆ రకంగా ఆమె ప్రజల నుంచి సానుభూతిని పొంది, 18 శానససభా స్థానాల్లోనూ ఓ లోకసభ స్థానంలోనూ పాగా వేయాలని చూస్తున్నారు.
విజయమ్మ ఆరోపణలపై తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులు విరుచుకుపడుతున్నారు. వైయస్ మరణం వెనక వైయస్ జగన్, వైయస్ విజయమ్మ కుట్ర ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అనే దాకా వేడి రాజుకుంది. తమ దేవుడిని తాము చంపుకుంటామా అంటూ వైయస్ విజయమ్మ బొత్స సత్యనారాయణపై మండిపడ్డారు.
నర్సంపేట, పాయకరావుపేట నియోజకవర్గాల్లో తాను ప్రచారం ప్రారంభించిన మొదటి రోజే వైయస్ హెలికాప్టర్ ప్రమాదాన్ని చర్చనీయాంశంగా మార్చారు. తన భర్త మరణంపై తనకు అనుమానాలున్నాయని, మూడు, నాలుగు నెలల పాటు మూలన పడి ఉన్న హెలికాప్టర్ను ఆ రోజు వాడారని ఆమె అన్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పౌర విమానయాన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రస్తుతం వైయస్ జగన్ ఆస్తుల కేసులో చంచల్గుడా జైలు ఉన్న ఐఆర్ఎఎస్ అధికారి బ్రహ్మానంద రెడ్డి వ్యవహరించారు.
విజయమ్మ ఆరోపణలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిస్పందించారు. వైయస్ మృతిపై తాజాగా దర్యాప్తు చేయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఇన్నాళ్లుగా మౌనంగా ఉండి, ఇప్పుడు వైయస్ మృతిని వైయస్ విజయమ్మ వివాదం చేయడం అనైతికమని బొత్స సత్యనారాయణ అన్నారు.