జగన్కు శిక్ష!: కిరణ్ కంటే మూడేళ్లు పెంచిన చంద్రబాబు
చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో మాట్లాడారు. వైయస్ జగన్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్యాకేజీలు ఇస్తున్నారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల ఎంతో మంది జైలుకు వెళ్లారన్నారు. జగన్ బెయిల్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు బెయిలు ఇవ్వడానికి ఎన్ని వందల కోట్లు ఎర చూపిస్తారోనని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడుతున్నాయన్నారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనడం ఆ పార్టీలకే చెల్లిందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందని, అవినీతికి ఆస్కారం ఇవ్వలేదన్నారు. కాంగ్రెసు పాలన మన రాష్ట్రానికి శాపంగా మారిందని మండిపడ్డారు. రైతుల పరిస్థితి దయానీయంగా మారిందన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు రెండు రోజుల్లో జైలుకెళ్తారన్నారు.
ఆయన తాటాకు చప్పుళ్లకు మేం బెదిరే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ఇసుక వ్యాపారాన్ని సిండికేట్గా మార్చి భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొడుతోందన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో భ్రష్టుపట్టిపోయిందని ఇందుకు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులే ప్రధాన కారణమని ఆరోపించారు.
ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాయన్నారు. ఈ పరిస్థితులు మారాలంటే రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డమ్మీగా మిగిలి పోయారని విమర్శించారు. అవినీతిపై పోరాటం సాగిస్తున్న అన్నా హజారే పోరాటానికి ప్రజలంతా మద్దతు తెలపాలన్నారు. అవినీతి పార్టీలను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు.