తల్లీ..వారు పట్టరా: విజయమ్మకు చిరు, వైయస్సే ఏ-1!
ఇవి సాదా సీదా ఉప ఎన్నికలు కావని, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ప్రజల సున్నిత మనస్తత్వాన్ని వైయస్ విజయమ్మ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మనం చాలా సున్నితమనస్కులమని దానిని క్యాష్ చేసుకోవాలని వారు చూస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయో ఒక్కసారి ఆలోచించి ఓటేయాలన్నారు. తమకు అన్యాయం జరిగిందని విజయమ్మ, షర్మిల చెబుతున్నారని, అన్యాయం ఎక్కడ జరిగిందో చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని రెండుసార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు పిసిసి చీఫ్గా కాంగ్రెసు చేసిందన్నారు. అది అన్యాయమా అని ప్రశ్నించారు.
జగన్కు ముఖ్యమంత్రి పదవి రానంత మాత్రాన విమర్శించాలా అన్నారు. తన కంపెనీలలో పెట్టుబడులు పెట్టించుకొని జగన్ అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని, గనులు దోచుకున్న వారికి వత్తాసు పలికారని విమర్శించారు. జగన్ వల్ల చాలామంది రాష్ట్రంలో నష్టపోయారని, అధికారులు, పారిశ్రామికవేత్తలు, మంత్రులు జైలుకెళ్లారని, వారి కోసం విజయమ్మ ఏనాడైనా రోడ్డెక్కారా అని, కన్నీటి బొట్టు కార్చారా అని ప్రశ్నించారు. అధికారం కోసం వారు ప్రజల ముందుకు వచ్చి కల్లిబొల్లి మాటలు చెబుతున్నారన్నారు.
జగన్ కోసమ వారు రోడ్డెక్కారన్నారు. తల్లీ నీకు ప్రజల గుండెకోత పట్టదా అని విజయమ్మను ఉద్దేశించి అన్నారు. జగన్, ఆయనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలది త్యాగమా అని ప్రశ్నించారు. త్యాగమంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీది అని, ఇందిరా గాంధీది అన్నారు. జగన్ కుటుంబంపై సానుభూతి చూపిస్తే నష్టపోయేది ప్రజలే అన్నారు. జగన్ అక్రమంగా ఆస్తులు కూడబెడితే విజయమ్మ వెనుకేసుకొస్తున్నారన్నారు. జగన్కు రాజకీయ భవితవ్యం లేదని, జైలు జీవితమే అన్నారు. జగన్ అవినీతిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు.
జగన్ను కాంగ్రెసు ఎలా చూస్తుంద వైయస్ను కూడా అలాగే చూడాలని చిరంజీవి ఓ న్యూస్ ఛానల్ ముఖాముఖిలో అన్నారు. సాక్షి మీడియా తదితర వాటి ద్వారా ఇప్పటి వరకు వన్ సైడ్గా జగన్కు అనుకూలంగా ప్రచారం జరిగిందని, కానీ క్రమంగా కాంగ్రెసు నేతల ఎదురు దాడికి దిగడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని, జగన్ అక్రమాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. దివంగత వైయస్ హయాంలో వన్ మ్యాన్ షో నడిచిందన్నారు. ఆయన నిర్ణయాలకు మంత్రులు, అధికారులు బలయ్యారని విమర్శించారు. జగన్ అక్రమాస్తుల కేసులో వైయస్ బతికి ఉంటే ఆయన ప్రథమ ముద్దాయి అయ్యే వాడన్నారు.