నర్సాపురం: వైయస్ జగన్ పార్టీ అభ్యర్థి ఎదురీత
బిసి ఓట్లే నర్సాపురంలో అభ్యర్థులను జయాపజయాలు నిర్ణయించే పరిస్థితి ఉంది. 1994 నుంచి సుదీర్ఘకాలంపాటు ఇక్కడినుంచి తెలుగుదేశం తరఫున ఎన్నికై, మంత్రిగా కూడా పని చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీచేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ విలీనంతో ఆయన కాంగ్రెసు అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనకు ఇక్కడ బలమైన పట్టు, స్థానికులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెసు పార్టీకి కొంత కలిసివచ్చింది. బలమైన సామాజిక వర్గానికి చెందిన సుబ్బారాయుడు మిగతా పార్టీలకు గట్టి పోటీయే ఇస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ ప్రచారం చేశారు. బీసీ ఓటర్లపై హామీల వర్షం కురిపించారు.
దాదాపు 45వేలకు పైగా ఉన్న బీసీ ఓటర్లు గత ఎన్నికల్లో ముదునూరి ప్రసాదరాజుకు అండగా నిలిచారు. అందుకే సుబ్బారాయుడు ఓడిపోయారు. పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ నాయకత్వం యావత్తు బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నాలు సాగిస్తోంది. గత ఓటమి పాలైన తెలుగుదేశం ఈసారి ఎలాగైనా ప్రతిష్ఠను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ ప్రాంతంలో మంచిపేరు, బలహీనవర్గాలతో అనుబంధం, నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గం నుంచి కొంత అనుకూలత ఉన్న డాక్టర్ చినమిల్లి సత్యనారాయణను బరిలోకి దింపింది.
గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీచేసిన బొమ్మిడి నారాయణరావుకు కేవలం పదివేల ఓట్లే వచ్చాయి. దీంతో ఈసారి అందరికీ అనుకూలుడు, వివాదరహితుడైన డాక్టర్ సత్యనారాయణను రంగంలోకి దింపింది. డాక్టర్ వృత్తిలో రాణించిన సత్యనారాయణ ఇప్పుడు తనకున్న పాత పరిచయాలతో ప్రచారం కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పటికే మూడు దఫాలుగా ప్రచారం నిర్వహించారు. 2009 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ప్రసాదరాజుకు బీసీ ఓటర్లే నేరుగా గెలుపును అందించారు. ఆయనపై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకతను సానుభూతి పవనాలు అధిగమిస్తాయని ఆ పార్టీలో ధీమా కనిపిస్తోంది. ప్రసాదరాజు పక్షాన ఇప్పటికే జగన్, విజయలక్ష్మి ప్రచారం చేశారు.