విజయమ్మ: ఆఖరి అస్త్రం ముందే ప్రయోగించిన జగన్!

జగన్ తల్లి అయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను ఆయన ప్రధాన అస్త్రంగా భావిస్తున్నారు. మంగళవారం పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గత నెల 27వ తేదిన జగన్ను సిబిఐ అరెస్టు చేయడంతో వైయస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిల ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. జగన్ స్థానంలో అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. పార్టీలో కొత్త ఉత్సాహం నింపారు.
వైయస్ విజయమ్మ, షర్మిల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే దాదాపు అన్ని స్థానాలను గెలుస్తుందని అందరూ భావిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఎలాగూ గెలిచే ఉప ఎన్నికలలో విజయమ్మతో ప్రచారం చేయించడం ద్వారా జగన్ తొందర పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేసిన అభ్యర్థులే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున బరిలోకి దిగడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్.
దానికి తోడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానం, జగన్ అరెస్టు కారణంగా వారికి సానుభూతి తోడయింది. ఈ నేపథ్యంలో మెజార్టీ సంగతి పక్కన పెడితే ఖచ్చితంగా జగన్ పార్టీ అభ్యర్థులే గెలిచే స్థానాలు. గెలిచే స్థానాలని తెలిసి తెలిసి విజయమ్మతో ప్రచారం చేయించడం ద్వారా 2014కు మంచి ఆయుధాన్ని జగన్ కోల్పోయారని అంటున్నారు. విజయమ్మ ప్రచారంతో ఇప్పటికిప్పుడు పార్టీకి ఒరిగింది ఏమైనా ఉన్నదా అంటే కేవలం మెజార్టీయే అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఆమె ప్రచారానికి ప్రజల నుండి సానుభూతి వెల్లువెత్తింది. దీంతో ఆ పార్టీ వైపు కొంత మొగ్గు కనిపించిందని అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. విజయమ్మ సానుభూతి ద్వారా ఓట్లు సంపాదించుకున్నారని, అది ఎంతో కాలం ఉండదని చెబుతున్నారు. సానుభూతి ఎల్లకాలం ఉండదనే నేతల వ్యాఖ్యలతో అందరూ ఏకీభవించాల్సిందే! విజయమ్మను ఇప్పుడు ప్రయోగించడం కంటే 2014లో ప్రయోగిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
వైయస్ జగన్ ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించారని చెబుతున్నారని... కాని కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాత్రమే కాకుండా కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి వంటి మహామహులను ఉప ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంది కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే కాంగ్రెసు జాతీయ పార్టీ అని ఆ పార్టీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తేడా ఉంటుందని, విజయమ్మను ఉప ఎన్నికలలో ప్రయోగించడం ద్వారా జగన్ కాస్త తొందరపడ్డారని మరికొందరు అంటున్నారు. 2014కు ఆయనకు ఓ అస్త్రం లేకుండా పోయిందని చెబుతున్నారు.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. వైయస్ విజయలక్ష్మి, షర్మిల కన్నీళ్లతో ప్రచారం చేయడం వల్ల ఉప ఎన్నికలలో ఆ పార్టీకి కొంత అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తు అంతా పతనమేనని, జగన్ తల్లి కన్నీళ్లను చివరి అస్త్రంగా వాడటంతో ఆయన చేతిలో అన్ని అస్త్రాలు అయిపోయాయని చెప్పారు. జగన్ ఓదార్పు ప్రభావం తగ్గిందని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు.












Click it and Unblock the Notifications