విభజన తుది ఘట్టానికి: టిజి వెంకటేష్ సంచలన వ్యాఖ్య

తాము తమ ప్రాంత హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పారు. తమ ప్రాంతం రాయలసీమ అభివృద్ధి, సమైక్యాంధ్ర, అందరూ గౌరవంగా బ్రతకాలనే మూడు అంశాల పైన రాయలసీమ హక్కుల పోరాట వేదిక ఉద్యమిస్తోందన్నారు. విభజన అంశం ప్రస్తుతం తుది ఘట్టంలో ఉందన్నారు. తమ రాయలసీమ ప్రాంతం ఇప్పటికే రెండుసార్లు మోస పోయిందని, మళ్లీ మూడోసారి మోసపోయేందుకు తాము సిద్ధంగా లేమన్నారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెసు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. విభజనపై పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తమ ప్రాంత ప్రజలకు చెప్పుకోవడానికి ముందుగా తమకు వివరించాలని అన్నారు. ఇప్పటికే తెలంగాణపై దాదాపు అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నాయని, కాంగ్రెసు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, త్వరలో అధిష్టానం తమ నిర్ణయాన్ని చెబుతుందన్నారు. కాంగ్రెసు తన నిర్ణయం తీసుకుంటే ఇక ఏ శక్తి ఆపలేదన్నారు.
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారేమో అనే ఆందోళన కలుగుతోందన్నారు. ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు చేయాల్సి వస్తే రాయలసీమ నేతలకు ముందుగా చెప్పాలన్నారు. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకునే రోజు మాత్రం వచ్చిందన్నారు. 2009 వలే అర్ధరాత్రి ప్రకటనలు చేయవద్దని కోరారు. తెలంగాణ ఇస్తే తెరాసను రద్దు చేస్తామని సంకేతాలు ఇస్తున్నారన్నారు.
మా హక్కుల గురించి ఆలోచిస్తే తెలంగాణకు మద్దతివ్వడంపై ఆలోచిస్తామన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు ముందుగా ఊహించినవి కావన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉప ఎన్నికల ఫలితాలు ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. తెలంగాణ వస్తే తమకు భద్రత ఉండదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఇన్నాళ్లూ సమైక్యాంధ్ర అన్న టిజి వెంకటేష్ ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడటాన్ని తెలంగాణ నేతలు స్వాగతిస్తున్నారు.












Click it and Unblock the Notifications