ధరణిపై సిట్ తో విచారణ- ఎల్ నినోపై హైఅలర్ట్: 20న..: తెలంగాణ మంత్రివర్గం నిర్ణయాలు
ఎల్ నినో ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై మంత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. అలాగే.. ఈ ఆందోళనకర పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో తీసుకోవలసిన చర్యలపై మంత్రివర్గంలో సుధీర్ఘంగా చర్చించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రజాభవన్లో ఓ టోల్ ఫ్రీ హెల్ప్లైన్ను ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ దీన్ని పర్యవేక్షిస్తుంది. ఈ హెల్ప్ లైన్ ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. టోల్ ఫ్రీ నంబర్.. 18001237157.

తీవ్ర వర్షాభావ పరిస్థితులపై పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదించి నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక బృందాన్ని పంపించాలని కోరాలని భావించింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని మంత్రివర్గం కేంద్రాన్ని కోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా 30- 35 శాతానికి మించి వర్షపాతం నమోదు కాలేదని ఈ సందర్భంగా పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎక్కడే గానీ సాధారణ వర్షపాతం లేదని, ఈ పరిస్థితుల్లో అవసరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
వివిధ రిజర్వాయర్లల్లో అందుబాటులో ఉన్న జలాల్లో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతాంగానికి మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. వర్షాభావ పరిస్థితులపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఉమ్మడి జిల్లా ఇన్ ఛార్జి మంత్రితో పాటు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఈ నెల 20న జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు అందరితో సమావేశాలు నిర్వహించి జిల్లాల వారిగా తలెత్తిన పరిస్థితులు, జరిగిన నష్టంపై సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి సారథ్యంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక నివేదిక రూపొందించాలని మంత్రివర్గం సూచించింది.
ఈ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. భూముల రికార్డులు, భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని, టెండర్ ప్రక్రియ మొదలుకొని ఇటీవలి వరకు వచ్చిన ఆరోపణల వరకు అన్ని అంశాలపై విచారణ జరిపించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఈనాటి వరకు భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా జరిగిన అన్ని అనుమానాస్పద లావాదేవీలను లోతుగా పరిశీలించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.














Click it and Unblock the Notifications