జగన్కు నోటీసుల అందజేత: సమన్లు రాలేదు.. రోశయ్య
దానిపై సోమవారం విచారణ జరిపిన కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు తీసుకోవడానికి జగన్ తరఫు న్యాయవాదులు నిరాకరించారు. దీంతో ఈడి కోర్టును ఆశ్రయించింది. జగన్ తరఫు న్యాయవాదులు నోటీసులు తీసుకోకపోవడంతో జైలులో ఉన్న ఆయనకు నోటీసులు అందజేయాలని ఈడికి కోర్టు సూచించింది. దీంతో బుధవారం మధ్యాహ్నం జైలుకు వెళ్లిన అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు.
కోర్టు కేసు విచారణను 25వ తేదికి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో ఎందుకు విచారించరాదో చెప్పాలంటూ జగన్కు అందించిన నోటీసులో ఈడి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దీనిపై జగన్ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అనంతరం విచారణ జరుగుతోంది. జగన్ సంస్థలలోకి విదేశాల నుండి అక్రమంగా పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలపై ఈడి జగన్ను విచారణ జరిపేందుకు అనుమతి కోరింది.
మరోవైపు అమీర్పేట భూముల కేసులో ఎసిబి కోర్టు జారీ చేసిన సమన్లు తనకు ఇంతవరకు అందలేదని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య బుధవారం చెన్నైలో చెప్పారు. తనకు ఇంతవరకు సమన్లు అందలేదని, మీడియా ద్వారానే తాను చూస్తున్నట్లు చెప్పారు. సమన్లు అందుకున్న తర్వాత న్యాయపరమైన కోణాల్లో పరిశీలించి అప్పుడు వాటిపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.
రోశయ్యకు రెండు రోజుల క్రితం సోమవారం ఎసిబి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాదులోని అమీర్పేట భూముల కేటాయింపు కుంభకోణం కేసులో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 2వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు రోశయ్యను ఆదేశించింది. ఈ కేసులో ఇంతకు ముందు సమర్పించిన నివేదికను కోర్టు తిరస్కరించింది. రోశయ్యను విచారించకుండా ఎసిబి నివేదికను కోర్టుకు సమర్పించింది. రోశయ్యకు ఎసిబి నోటీసులు ఇచ్చిన విషయం తమకు తెలియదని, తెలిసిన తర్వాత స్పందిస్తామని ఏఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు.
ఇంకోవైపు ఎంపీ సంతకం ఫోర్జరీ కేసులో సీనియర్ ఐపిఎస్ అధికారి ఉమేష్ కుమార్ బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. రూ.10వేల పూచికత్తును కోర్టుకు సమర్పించారు. ఉమేష్ కుమార్ పైన ఉన్న నాన్ బెయిలబుల్ వారెంటును న్యాయస్థానం రీకాల్ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఉమేష్ నాంపల్లి కోర్టులో హాజరయ్యారు.