షాక్పై షాక్: 'గాలి' బ్రాహ్మణికి నీటి కేటాయింపులు రద్దు
బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వం రద్దుకు సంబంధించిన జివో నెంబర్ 38ని విడుదల చేసింది. కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలంలో బ్రాహ్మణీ స్టీల్స్ ప్రాజెక్టును చేపట్టారు. బ్రాహ్మణీ స్టీల్స్ కోసం అప్పుడు జివో నెంబర్ 162, 761, 84లను విడుదల చేశారు. ఈ మూడు జివోలను రద్దు చేస్తూ తాజాగా ప్రభుత్వం కొత్తగా జివో నెంబర్ 38ని విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితమే బ్రాహ్మణీ స్టీల్సుతో ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
బ్రాహ్మణీ స్టీల్సును అనుకున్న సమయంలో పూర్తి చేయక పోవడంతో విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాయి. వ్యక్తి ప్రయోజనాల కోసమే దానిని కేటాయించారని, లేదంటే ఇప్పటి వరకు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం, విపక్షాల ఎదురుదాడి నేపథ్యంలో కిరణ్ ప్రభుత్వం ఇటీవల బ్రాహ్మణీ స్టీల్సుతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇప్పుడు నీటి కేటాయింపులు కూడా రద్దు చేసింది.
కాగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల గుంటూరు, ప్రకాశం జిల్లాలోని వాన్పిక్కు సంబంధించిన భూ కేటాయింపులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల పది రోజుల క్రితమే ఖమ్మం, వరంగల్ జిల్లాలోని బయ్యారం గనుల లీజును రద్దు చేసింది. బయ్యారం గనులు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్కు చెందినవిగా వార్తలు ఉన్నాయి.