పాకిస్తాన్ ప్రధానిగా రాజా గిలానీ స్థానంలో షహబుద్దీన్
యూసుఫ్ రజా గిలానీపై పాకిస్థాన్ సుప్రీం కోర్టు అనర్హత వేటు వేసిన దరిమిలా పరిణామాలు శరవేగంగా చోటు చేసుకున్నాయి. ఈ మేరకు బుధవారం ఉదయమే అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, పిపిపి సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ప్రధాని ఎన్నిక కోసం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జాతీయ అసెంబ్లీ సమావేశమవుతుందని పిపిపి నేత ఖుర్షీద్ షా వెల్లడించారు. కొత్త ప్రధాని ఎంపికలో పూర్తి సహకారం అందిస్తామంటూ జర్దారీకి సంకీర్ణ కూటమి భాగస్వామ్యపక్షాలు హామీ ఇచ్చాయి.
కాగా, షహబుద్దీన్ అభ్యర్థిత్వంపై సంకీర్ణ కూటమి నేతల భేటీలో గిలానీ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఏప్రిల్ 26 నుంచే గిలానీని అనర్హుడిగా పరిగణిస్తున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొన్నందున.. గిలానీ మంత్రివర్గం కూడా ఆనాటి నుంచే విధులకు దూరంగా ఉన్నట్టు సర్కారు గజిట్లో పేర్కొన్నారు. మరి గత రెండు నెలల్లో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు రద్దవుతాయా? లేదా? అనే మీమాంస వ్యక్తమవుతోంది.
కాగా పిపిపి అధినేత బాధ్యతల నుంచి తప్పుకోకుండా అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్పై గురువారం విచారణ జరగనుంది. 2011 మే నాటి లాహోర్ ఫుల్కోర్టు బెంచ్ ఉత్తర్వుల్లో ఆశించినట్టుగా పిపిపి కో చైర్మన్ పదవి నుంచి జర్దారీ వైదొలగకపోవడం కోర్టును ధిక్కరించినట్టేనంటూ న్యాయవాది అజార్ సిద్దిఖీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.