జగన్ పార్టీకి స్థానం లేకుండా చేయాలి: కోదండరామ్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించటానికి తెలంగాణ మార్చ్ పేరుతో సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈనెల 20న జిల్లా జెఏసిల విస్తృత స్థాయి సమావేశాలు జరిపి.. వ్యూహాన్ని సిద్ధం చేస్తామన్నారు. ఈ నెల 21 నుంచి 30 వరకు ఉద్యమ విస్తరణ ఉంటుందని, ఆగస్టు 1 నుంచి 85 రోజులు వరసగా ప్రచార కార్యక్రమాలు, ఆందోళనలు ఉంటాయని చెప్పారు. సమావేశానికి తెరాస, బిజెపిలను ఆహ్వానించలేదు.
న్యూడెమోక్రసీ నేతలు, ఉద్యోగ-ప్రజా సంఘాల నేతలతోపాటు, ఐకాస జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. తెరాస, బిజెపి ఐకాసలోనే ఉన్నాయని, భవిష్యత్తులోనూ కలిసే పని చేస్తామని కోదండరామ్ చెప్పారు. జగన్ పార్టీకి తెలంగాణలో స్థానం లేకుండా చేయాలని నిర్ణయించినట్లు కోదండరాం తెలిపారు. సీమాంధ్ర పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్, టిటిడిపి, జగన్ పార్టీలను ఎండగడుతూ ప్రజలను కదిలించాలని తీర్మానించినట్లు చెప్పారు. సీమాంధ్ర పాలకుల జేబు సంస్థగా కాంగ్రెస్ పార్టీ మారిందని కోదండరాం విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీని నమ్మటానికి లేదని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేవరకు, ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు సంఘటితంగా కొట్లాడాలని సమావేశం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలతో ఉండాల్సిన టిటిడిపి అధికార పార్టీతో మిలాఖతై, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ విషయంలో టిడిపి ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలని తీర్మానించామన్నారు. తెలంగాణ ఆకాంక్ష వ్యక్తీకరణకు రాష్ట్రపతి ఎన్నికలను ఆయుధంగా మలుచుకోవాలని, ఈ దిశగా రాష్ట్ర సాధనకు కృషి చేయాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు ఈనెల 10న ఐకాస తరఫున ఉత్తరాలు రాస్తామని తెలిపారు.
అయితే రాష్ట్రపతి ఎన్నికల్లోనే ఈ పని చేయాలని కోరమని, కేవలం లేఖలు మాత్రమే రాస్తామని, ఏ రకంగా వ్యవహరించేది వారిష్టమని చెప్పారు. ఉద్యమంలో తప్పనిసరిగా విరామాలు ఉంటాయని, ప్రస్తుతం ప్రకటించిన కార్యాచరణ యథాతథంగా అమలవుతుందన్నారు. రైతులు, యువత, అసంఘటిత రంగాలను కూడా ఉద్యమంలోకి తీసుకొస్తామని తెలిపారు. లక్ష్మీపేట బాధితులను పరామర్శించటానికి ఐకాస ప్రతినిధి బృందం వెళ్లనున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications