వైయస్కు సోనియా గాంధీ చెప్పారా: జగన్ పార్టీ నేత

ఈ పథకాలు అమలు చేయాలని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే చెప్పారా అని ఆమె అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై అక్కసుతోనే ఆ విధంగా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత మూడేళ్లలో మీరేం చేశారని ఆమె కాంగ్రెసు నాయకులను ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం ఛిన్నాభిన్నమైందని ఆమె విమర్శించారు.
చేతనైతే వైయస్ రాజశేఖర రెడ్డిలా బతకాలని, పథకాలు పేర్లు మార్చే ప్రయత్నం చేయవద్దని ఆమె అన్నారు. నార్కో టెస్టు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పిన విషయం సిబిఐకి గుర్తు లేదా అని ఆమె అడిగారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు నార్కో టెస్టులు జరపడానికి అనుమతించాలని కోరుతూ సిబిఐ పిటిషన్ దాఖలు చేయడంపై ఆమె ఈ విధంగా ప్రతిస్పందించారు.
ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం నశించిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పథకాలకు ఏ పేర్లు పెట్టినా ప్రజలు కాంగ్రెసును నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి దారుణంగా తయారైందని, అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications