ఆడశిశువుల భ్రూణహత్యలు ఆపితే గ్రామానికి కోటి
ఆడశిశువుల భ్రూణహత్యలకు వ్యతిరేకంగా పనిచేసే గ్రామాలు హర్యానాలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా సానుకూలమైన సామాజిక మార్పునకు స్ఫూర్తిని ఇస్తాయని హుడా అన్నారు. బీబీపూర్ గ్రామం కాప్ పంచాయతీలో తొలిసారి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడశిశువుల భ్రూణహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలని ఆ గ్రామం నిర్ణయించింది.
ఆడశిశువుల భ్రూణహత్యలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి జరిగిన మహాపంచాయతీకి హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలువురు కులపెద్దలు హాజరయ్యారు. మహాపంచాయతీ కాప్ పంచాయతీల సమాఖ్య.
ఆడశిశువుల భ్రూణహత్యల వల్ల బాలికల జనాభా తగ్గుతోందని, దీనికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా కాప్ పంచాయతీలు ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి హుడా పిలుపునిచ్చారు. ఆడశిశువుల భ్రూణహత్యలను నిరోధించడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని, అయితే ప్రజల సహకారం ఉంటేనే అవి ఫలితాలు సాధిస్తాయని ఆయన అన్నారు.