విజయమ్మ దీక్షపై తెలంగాణ రాములమ్మ ఫైర్
తెలంగాణకు న్యాయం జరగాలని, బడుగు వర్గాలకు న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నామని ఆమె చెప్పారు. రాయలసీమలో పలు సమస్యలున్నాయని, వైయస్ విజయమ్మ ఆ ప్రాంతంలో ఎందుకు ఆందోళనలు చేపట్టడం లేదని ఆమె అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వైయస్ విజయమ్మ దీక్ష చేస్తున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణ పట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చిత్తశుద్ధి లేదని, అందుకే తాము వైఖరి చెప్పాలని అడుగుతున్నామని ఆమె అన్నారు. తెలంగాణపై మీ వైఖరి ఏమిటని మాత్రమే వైయస్ విజయమ్మను అడుగుతున్నామని, వైఖరి స్పష్టం చేసిన తర్వాత వస్తే తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని ఆమె అన్నారు.
వైఖరి స్పష్టం చేయనంతవరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వైయస్ విజయమ్మనైనా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులనైనా అడుగుతామని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని, చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆమె విమర్శించారు. సమైక్యవాద పార్టీల వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఆ పార్టీల వల్లనే వివిధ వర్గాలకు చెందినవారు తెలంగాణలో మరణించారని ఆమె విమర్శించారు.
తెలంగాణకు వై ఎస్, సమైక్యాంధ్రకు ఎస్ చెప్పడమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విధానమని, అందుకే తాము వ్యతిరేకిస్తున్నామని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతాయని ఆమె అన్నారు. తెలంగాణలోని సమస్యలను పట్టించుకుని వాటి పరిష్కారం కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నామని, తాము వదిలిపెట్టలేదని, సమైక్యవాద పార్టీలు వచ్చి తెలంగాణ సమస్యలపై పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించాలని వైయస్ విజయమ్మ దీక్ష తలపెట్టారని ఆమె వ్యాఖ్యానించారు.
సమైక్యవాద పార్టీలు వచ్చి సమస్యలను పరిష్కరిస్తామంటే తెలంగాణలో నమ్మేవారు ఎవరూ లేరని, పార్టీని బలోపేతం చేసుకోవడానికి మాత్రమే విజయమ్మ దీక్ష తలపెట్టారని, చేనేత కార్మికులపై చిత్తశుద్ధితో కాదని ఆమె అన్నారు. దీక్ష సందర్భంగా ఏదైనా జరిగితే దానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. తెలంగాణ వస్తోంది కదా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారని, తెలంగాణ వస్తే మీరెందుకని ఆమె అన్నారు. తెలంగాణకు అనుకూలమని ఎందుకు చెప్పడం లేదని ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను అడిగారు. తెలంగాణ వస్తుందనే నమ్మకం కెసిఆర్కు ఉండవచ్చు గానీ కాంగ్రెసు ఇస్తుందనే నమ్మకం తనకు లేదని ఆమె అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఆమె రాయలసీమ కాంగ్రెసు పార్టీగా అభివర్ణించారు.
తెలంగాణకు అన్యాయం చేస్తున్న పార్టీలను తాము తప్పకుండా నిలదీస్తామని ఆమె చెప్పారు. ప్రతిసారీ ఏదో ఒక కొత్త పార్టీ రావడం తెలంగాణవాదాన్ని బలహీన పరిచే ప్రయత్నం చేయడం పరిపాటి అవుతోందని ఆమె అన్నారు. తాము ఎవరికీ భయపడబోమని ఆమె అన్నారు. తెలంగాణపై వైఖరి చెప్పాలని తెలుగుదేశం పార్టీని అడిగామని, అలాగే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అడుగుతున్నామని, పార్టీకంటూ ఓ వైఖరి ఉండాలి కదా అని ఆమె అన్నారు. తెలంగాణపై వైఖరి చెప్పాలని తప్ప తాము మరేమీ అడగడం లేదని ఆమె అన్నారు.