తప్పుంటే రాళ్లతో కొట్టి చంపండి: గాలి బెయిల్పై ఏరాసు

గాలి బెయిల్ వ్యవహారంలో తనపై దురుద్దేశంతోనే బురద చల్లుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. తన ప్రమేయం ఉన్నట్లు వచ్చిన వార్తలపై విచారణ జరిపించాలని తాను కోరుతున్నానని ఆయన అన్నారు. తాను గాలి జనార్దన్ రెడ్డికి సమీప బంధువైనందు వల్ల తనపై అనుమానాలు వ్యక్తం కావడం సహజమే కావచ్చునని, అయితే తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసు నుంచి మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డిని తప్పించడానికే తనను ఇందులో ఇరికించారని సస్పెన్షన్కు గురైన న్యాయమూర్తి లక్ష్మీనరసింహారావు ఎసిబికి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లు మంగళవారం వార్తలు వచ్చాయి. ఈ వార్తలపైనే ఏరాసు ప్రతాప రెడ్డి స్పందించారు. గతంలో కూడా ఏరాసు ప్రతాపరెడ్డిపై ఆ విధమైన ఆరోపణలు వచ్చాయి.
గాలి జనార్దన్ రెడ్డి జైలులో ఉండగా ఏరాసు ప్రతాప రెడ్డి చంచల్గుడా జైలును సందర్శించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గతంలో వార్తలు వచ్చాయి. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణంలో ఆయన పాత్ర ఉండవచ్చునని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. తన ప్రమేయం ఏ మాత్రం లేదని ఆయన అప్పుడే స్పష్టం చేశారు. తాజాగా ఆయన పేరు మరోసారి తెర మీదికి వచ్చింది.












Click it and Unblock the Notifications