నేను పారిపోలేదు: మంత్రి సారయ్య కొడుకు శ్రీమాన్
తన తండ్రికి జరిగిన అవమానంపై కేసు పెట్టేందుకు తాను పోలీసు స్టేషన్కు వెళ్లానని శ్రీమాన్ తెలిపారు. తాను పోలీసులపై దౌర్జన్యంగా ప్రవర్తించలేదన్నారు. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు. తన తండ్రి సారయ్యకు సెక్యూరిటీని ఇవ్వడంలో పోలీసులు వైఫల్యం చెందారని, దానినే తాను ప్రశ్నించానని చెప్పారు. తనపై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసుపై హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలుస్తానని చెప్పారు.
కాగా ఇరవై రోజుల క్రితం ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి సారయ్యకు వ్యతిరేకంగా కొంత మంది విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పురపాలక శాఖ మంత్రి మహీధర్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో వారు సారయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సారయ్య కుమారుడు శ్రీమాన్ పోలీసు స్టేషన్కు వెళ్లి వీరంగం సృష్టించినట్లుగా వార్తలు వచ్చాయి. ఎస్సై రమేష్పై తిట్ల వర్షం కురిపించినట్లుగా పోలీసులు చెప్పారు.
ఎస్సై రమేష్ శ్రీమాన్పై రాతపూర్వకమైన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు శ్రీమాన్పై కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే అతను పరారీలో ఉన్నాడని అందుకే అరెస్టు చేయడం లేదని పోలీసులు చెప్పుకొచ్చారు. రెండు రోజుల క్రితం ఆయనకు హైకోర్టు శ్రీమాన్కు ముందస్తు బెయిల్ ఇచ్చింది.