టెక్కీ నీలిమ మృతి: పోలీసుల అదుపులో ముగ్గురు
నీలిమ శరీర అవయవాలతో పాటు వస్త్రాలను ల్యాబ్కు పంపిస్తున్నామని చెప్పారు. నెల రోజుల తరువాతనే పూర్తి నివేదిక వస్తుందని, అప్పటి వరకు తాము ఏమీ చెప్పలేమని ఫోరెన్సిక్ వైద్యులు మీడియా ప్రతినిధులకు తెలిపారు. అయితే నీలిమ ఫోన్ కాల్లిస్ట్ ఆధారంగా ముగ్గురు ఇన్ఫోసిస్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. కాగా విదేశాల్లో ఉన్న నీలిమ సోదరుడు శుక్రవారం హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఆయన వచ్చేవరకు మృతదేహాన్ని గాంధీ మార్చురీలో భద్రపరుస్తున్నారు. కాగా, నీలిమ అనుమానాస్పద స్థితిలో మరణించలేదని ఆమెను ఎవరో హత్య చేసి ఉండవచ్చని ప్రగతిశీల మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య అన్నారు. నీలిమ హత్య వెనుక ఎవరున్నారో పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని, లేదంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నీలిమ మృతికి కారకులను వెంటనే కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రైవేట్ రంగ ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షుడు శివ కూడా కోరారు. నీలిమ మంగళవారంనాడు అనుమానాస్పద స్థితిలో మరణించింది. వరంగల్ జిల్లా, కొత్తపల్లి గ్రామానికి చెందిన వై.రాణి కూకట్పల్లిలోని ఆర్ఆర్ టవర్స్లో నివాసముంటోంది. ఈమె చిన్న కుమార్తె నీలిమ (27)కు కొద్ది కాలం క్రితం నగరానికి చెందిన సుధాకర్రెడ్డితో వివాహం జరిగింది.
నీలిమ ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా, సుధాకర్రెడ్డి వొడాఫోన్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. వివాహమైన ఆరు నెలల తరువాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. విడివిడిగా ఉంటున్నారు. ఇంతలో నీలిమ ఇన్ఫోసిస్ కంపెనీ తరఫున ప్రాజెక్టు వర్క్ నిమిత్తం అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్లింది. సెలవుపై ఈమె జూలై 21న నగరానికి వచ్చింది.